Rohit Sharma: ఆస్ట్రేలియాలో ఫ్లాప్ షో.. రోహిత్, కోహ్లీ రిటైరయ్యే సమయం వచ్చేసిందా?.. రవిశాస్త్రి ఏమన్నాడంటే..!

Time for Rohit Sharma and Virat Kohli to retire what Ravi Shastri said
  • మూడు టెస్టుల్లో కలిపి రోహిత్ చేసింది 31 పరుగులే
  • పెర్త్ టెస్టులో సెంచరీ తర్వాత దారుణంగా విఫలమవుతున్న కోహ్లీ
  • విరాట్ మరో మూడునాలుగేళ్లు ఆడతాడన్న రవిశాస్త్రి
  • రోహిత్ మాత్రం ఈ సిరీస్ ముగిసే లోపు ఆలోచించుకోవాలన్న మాజీ కోచ్
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సారథి రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ ఫ్లాప్ షో కొనసాగుతుండటంతో వారి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పెర్త్ టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ ఆ తర్వాత మాత్రం వరుసగా 7, 11, 3, 36, 5 పరుగులు చేసి నిరుత్సాహ పరిచాడు.

ఇక రోహిత్ శర్మ మూడు టెస్టుల్లో కలిపి చేసింది 31 పరుగులు మాత్రమే. వరుసగా 3, 6, 10, 3, 9 పరుగులు చేశాడు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో భారత్ 0-3తో వైట్ వాష్ అయింది. ఈ సిరీస్‌లో రోహిత్ 91 పరుగులు చేయగా, కోహ్లీ 93 పరుగులు చేశాడు. 

ఈ నేపథ్యంలో వారిద్దరి రిటైర్మెంట్ వార్తలపై టీమిండియా మాజీ సారథి, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. కోహ్లీ మరో మూడునాలుగేళ్లు టెస్టు క్రికెట్ ఆడతాడని పేర్కొన్నాడు. అదే సమయంలో రోహిత్‌ గురించి మాట్లాడుతూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిశాక కెరియర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. నాలుగో టెస్టులో అత్యంత అవసరమైన సమయంలో వీరిద్దరూ దారుణంగా విఫలమైన నేపథ్యంలో శాస్త్రి ఇలా స్పందించాడు.     
Rohit Sharma
Virat Kohli
Ravi Shastri
Test Cricket
Team India

More Telugu News