HYDRA: అక్కడ నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే హక్కు ఉంది కానీ: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ వివరణ

HYDRA commissioner Ranganath explanation on demolitions
  • నీటి వనరుల్లోని నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే హక్కు ఉందన్న రంగనాథ్
  • మానవతా దృక్పథంతో 24 గంటల గడువు ఇచ్చినట్లు వెల్లడి
  • చట్టాలను పాటిస్తూ.. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే ఆక్రమణలు తొలగిస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. నిన్న ఉదయం ఖాజాగూడ భగీరథమ్మ చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై వివరణ ఇచ్చారు. తాము నిబంధనలు పాటిస్తూనే అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్నారు.

నీటి వనరుల్లోని నిర్మాణాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే హక్కు ఉందన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఇదే అంశంపై తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిందన్నారు. చట్టాలను పాటిస్తూనే... కోర్టులను గౌరవిస్తూనే తాము ఆక్రమణలను తొలగిస్తున్నామన్నారు.

బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లోని నిర్మాణాలనే తొలగించామని రంగనాథ్ వెల్లడించారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చవచ్చని... కానీ మానవతా దృక్పథంతో ఇరవై నాలుగు గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. నోటీసులు ఇచ్చాక కూడా 24 గంటల్లో ఖాళీ చేయనందునే కూల్చివేశామన్నారు. 

ఖాజాగూడలోని బ్రాహ్మణకుంట ప్రాంతంలో ఆక్రమణల తొలగింపులో హైడ్రా వ్యవహరించిన తీరుపై హైకోర్టు మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. ఇలాగే చేస్తే హైడ్రా కమిషనర్‌ను కోర్టుకు పిలవాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ వివరణ ఇచ్చారు.
HYDRA
AV Ranganath
Hyderabad
TS High Court

More Telugu News