Gautam Gambhir: క్రమశిక్షణ లేని ఆటగాళ్లు... కోచ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి... త్వరలోనే కొత్త రూల్స్!

Gautam Gambhir called out the indiscipline inside the team which needed to be resolved
  • టీమిండియా ఆటగాళ్లకు క్రమశిక్షణ లేదంటున్న హెడ్ కోచ్
  • బీసీసీఐ సమీక్షా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన గంభీర్
  • విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని పరిమితం చేయాలంటూ విజ్ఞప్తి
  • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో ఆటగాళ్లు తరచూ బయటకు వెళ్లడంపై అసహనం
ఇటీవలే ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఘోర వైఫల్యం నేపథ్యంలో కీలక మార్పులపై బీసీసీఐ దృష్టిసారించింది. ఈ విషయమై ఇటీవలే నిర్వహించిన సమీక్షా సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. జట్టులోని ఆటగాళ్లకు క్రమశిక్షణ లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గంభీర్, ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందంటూ బీసీసీఐ పెద్దలను కోరినట్టు సమాచారం.

సుధీర్ఘ పర్యటనల్లో, ముఖ్యంగా విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యుల కారణంగా ఆటగాళ్ల దృష్టి మళ్లుతోందని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. ఈ విషయంలో కఠినమైన మార్గదర్శకాలు అవసరమని అభిప్రాయపడుతున్నాడు. కోచ్ సూచనల మేరకు బీసీసీఐ ఆలోచిస్తోందని, ఆటగాళ్ల కుటుంబాలను కలిసి సమయాన్ని పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయని ‘ఇండియా టుడే’ పేర్కొంది.

‘‘ఆటగాళ్ల క్రమశిక్షణారహిత్యంపై గంభీర్ చాలా గుర్రుగా ఉన్నాడు. కఠినమైన మార్గదర్శకాలు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఓటమిపై బీసీసీఐ సమీక్ష సమావేశంలో భారత డ్రెస్సింగ్ రూమ్‌లో క్రమశిక్షణా రాహిత్యంపై ఆయన మాట్లాడారు. కొవిడ్‌కు ముందు ఉన్న నిబంధనలకు తిరిగి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ పర్యటనల్లో రెండు వారాల పాటు మాత్రమే కుటుంబ సభ్యులను అనుమతించాలని సూచించాడు. ఈ విషయంలో గౌతమ్ గంభీర్, ఆటగాళ్లు కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నారు’’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్టు వివరించింది.

మరోవైపు, కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి సమీక్షా సమావేశానికి హాజరైన కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు చెల్లింపు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చాడు. మ్యాచ్‌ ఫీజును వెంటనే చెల్లించవద్దని, డబ్బు చెల్లింపునకు ఆటగాళ్ల ప్రదర్శనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐ పెద్దలకు సూచించినట్టు తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో టీమ్ అంతా కలిసి ఒకే ఒక్క డిన్నర్‌ కోసం బయటకు వెళ్లగా, మరికొన్ని సందర్భాల్లో కొందరు ఆటగాళ్లు మాత్రం బృందాలుగా బయటకు వెళ్లారు. ఈ పరిణామాలే కోచ్ గంభీర్‌కు ఏమాత్రం రుచించడం లేదు. 
Gautam Gambhir
Sports News
Cricket
BCCI

More Telugu News