Rishabh Pant: చాంపియ‌న్స్ ట్రోఫీ.. ప్రాక్టీస్ లో స్టార్ ప్లేయ‌ర్ కు గాయం.. టీమిండియా శిబిరంలో ఆందోళ‌న!

Champions Trophy Blow To Team India As Star Rishabh Pant Gets Hit On Knee In Nets
  • ప్రాక్టీస్ లో పంత్ మోకాలికి గాయం
  • పాండ్యా ఆడిన భారీ షాట్‌ త‌గిలినట్లు మీడియా క‌థ‌నం 
  • నొప్పితో విల‌విల్లాడుతూ మైదానం వీడిన పంత్‌
  • కొద్దిసేప‌టి త‌ర్వాత మ‌ళ్లీ యథావిధిగా ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించిన వైనం
మరో రెండు రోజుల్లో ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈసారి హైబ్రిడ్ మోడ్ లో పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల‌లో టోర్న‌మెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ మెగా ఈవెంట్‌ కోసం ఇప్ప‌టికే రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు దుబాయ్ చేరుకుంది. ఆదివారం నుంచి ప్రాక్టీస్ మొద‌లుపెట్టింది. అయితే, ఈ ప్రాక్టీస్ సంద‌ర్భంగా స్టార్ ప్లేయ‌ర్, వికెట్ కీపర్ రిష‌భ్ పంత్ గాయ‌ప‌డ్డాడు. 

అత‌ని ఎడ‌మ‌ మోకాలిపై బంతి బ‌లంగా త‌గ‌ల‌డంతో మైదానంలోనే కుప్ప‌కూలాడు. నొప్పితో విల‌విల్లాడిన‌ అత‌డిని వైద్య సిబ్బంది గ్రౌండ్ నుంచి బ‌య‌ట‌కు తీసుకెళ్లిన‌ట్లు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' త‌న క‌థ‌నంలో పేర్కొంది. హార్దిక్ పాండ్యా ఆడిన ఓ బ‌ల‌మైన షాట్ ఇలా పంత్ మోకాలికి త‌గిలిన‌ట్లు తెలిపింది.

కాగా, 2022 డిసెంబ‌ర్ లో పంత్ కారు ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో అత‌ని అదే మోకాలికి తీవ్ర గాయాల‌య్యాయి. ఇప్పుడు మళ్లీ దానిపైనే బంతి బ‌లంగా త‌గ‌ల‌డంతో టీమిండియా శిబిరంలో ఆందోళ‌న నెల‌కొంది. అయితే, కొద్దిసేప‌టి త‌ర్వాత‌ డ్రెస్సింగ్ రూమ్ నుంచి తిరిగి మైదానంలోకి అడుగు పెట్టిన‌ పంత్‌.. అక్షర్ పటేల్‌తో కలిసి నవ్వుతూ కనిపించాడు. ఆ తర్వాత యథావిధిగా పంత్ నెట్స్‌లోకి అడుగు పెట్ట‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇక పంత్ కు ఇదే తొలి ఛాంపియన్స్ ట్రోఫీ. చాలా కాలంగా అతను జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా ఉన్నాడు. పరిమిత ఓవర్లలో ఇప్ప‌టికే అత‌ను తనను తాను నిరూపించుకున్నాడు. వన్డేలు, టీ20లు రెండింటిలోనూ 100 ప్ల‌స్‌ స్ట్రైక్ రేట్ తో దూసుకెళ్తున్నాడు. కాగా, ఈసారి టీమిండియ‌ త‌న మ్యాచ్ ల‌ను దుబాయ్ వేదిక‌గా ఆడ‌నున్న సంగ‌తి తెలిసిందే. 

ఈ టోర్నీలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 20న బంగ్లాదేశ్ తో భార‌త్‌ త‌న తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ఆ త‌ర్వాత 23న దాయాది పాక్ తో త‌ల‌ప‌డుతుంది. మార్చి 1న కివీస్ తో రోహిత్ సేన‌ త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఇక భార‌త్ రెండుసార్లు ఈ ట్రోఫీని ముద్దాడింది. 2002లో ఆతిథ్య శ్రీలంక‌తో కలిసి ట్రోఫీని పంచుకోగా, 2013లో ఇంగ్లండ్ ను మ‌ట్టిక‌రిపించి రెండోసారి విజేత‌గా నిలిచింది. 
Rishabh Pant
Champions Trophy 2025
Team India
Cricket
Sports News

More Telugu News