Nara Lokesh: వారిని స్కూల్ మెంటార్లుగా వినియోగించుకోవాలి: నారా లోకేశ్

Minister Nara Lokesh revew on school education
  • పాఠశాలల సమగ్ర అభివృద్ధిలో పూర్వవిద్యార్థుల భాగస్వామ్యం ఉండాలన్న మంత్రి
  • ఉపాధ్యాయులకు ప్రస్తుతమున్న 45 యాప్‌ల స్థానంలో ఒకటే యాప్ ఉండాలన్న మంత్రి
  • పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్స్ వ్యవస్థ ఉండాలన్న నారా లోకేశ్
  • పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఒకటే డ్యాష్ బోర్డ్ ఉండాలన్న మంత్రి
  • పాఠశాల విద్య, సమగ్ర శిక్షపై సమీక్షలో మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ విద్యా నమూనాలో భాగంగా పూర్వ విద్యార్థులు, పూర్వ విద్యార్థి సంఘాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కాంక్షించే వారిని స్కూల్ మెంటార్లుగా వినియోగించుకునే వ్యవస్థను రూపొందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్యా, సమగ్ర శిక్షపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ముందుకొచ్చే దాతలకు ఆయా పాఠశాలల సమగ్ర సమాచారం, మౌలిక వసతుల అవసరాలను తెలియపరిచి, నేరుగా పాఠశాలలు, కళాశాలలకే దాతల విరాళాలు అందే వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు, నిధుల వినియోగం, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పై సమావేశంలో కూలంకుషంగా చర్చించారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి కంప్యూటర్ ల్యాబ్‌లు, స్టెమ్ ల్యాబ్‌లు, పాఠశాల లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. 

పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఒకటే డ్యాష్ బోర్డ్

ఉపాధ్యాయులకు ఇప్పుడు 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్‌ను తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయులు కేవలం బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్స్ వంటి వ్యవస్థను తీసుకురావాలని, క్లస్టర్ స్థాయిలో సీఆర్పీలను వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అన్ని అంశాలు ఏకీకృతం చేసి ఒకే డాష్ బోర్డ్ రూపొందించాలన్నారు.

మంత్రి నుంచి క్షేత్రస్థాయి వరకు లాగిన్‌లు రూపొందించి, ఒకే సమాచారాన్ని పదేపదే సేకరించే పద్ధతికి స్వస్తి పలకాలని, ఉపాధ్యాయుల సమయాన్ని విద్యార్థుల కోసం సద్వినియోగపరుచుకునేలా చూడాలని ఆదేశించారు. జీవో 117 ఉపసంహరణ తర్వాత మోడల్ ప్రైమరీ స్కూళ్లను గరిష్టస్థాయిలో ఏర్పాటుచేసి ఒక క్లాస్‌కు ఒక టీచర్‌ను కేటాయించాలని, క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News