Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి

Key Talks Between India and Iran Ajit Doval Focuses on Chabahar Port and Transport Corridor
  • భారత్-ఇరాన్ మైత్రికి పెద్దపీట
  • ఇరాన్‌తో భారత్ చర్చలు ముమ్మరం
  • ప్రాంతీయ శాంతిలో ఇరాన్ పాత్ర కీలకమన్న దోవల్
భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్.. ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి డాక్టర్ అలీ అక్బర్ అహ్మదియాన్‌తో సోమవారం టెలిఫోన్‌లో కీలక చర్చలు జరిపారు. ఈ సంభాషణలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ముఖ్యంగా చాబహార్ పోర్ట్ అభివృద్ధి, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ) వంటి కీలక ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

అజిత్ దోవల్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఇరాన్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించుకోవడానికి, ముఖ్యంగా వ్యూహాత్మకమైన చాబహార్ పోర్టును అభివృద్ధి చేయడంలోనూ, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్‌ను ముందుకు తీసుకెళ్లడంలోనూ భారత్ ఎంతో ఆసక్తిగా ఉందని అహ్మదియాన్‌కు వివరించినట్లు సమాచారం.

చాబహార్ పోర్ట్, ఐఎన్ఎస్‌టీసీ ప్రాజెక్టులు భారత్‌కు వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవి. అఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియా దేశాలతో నేరుగా వాణిజ్య సంబంధాలను నెరపడానికి చాబహార్ పోర్ట్ భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. అదేవిధంగా, ఐఎన్ఎస్‌టీసీ ద్వారా రష్యా, ఐరోపా దేశాలకు సరుకు రవాణా సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య జరిగిన ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుల పురోగతి వేగవంతం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Ajit Doval
Iran
India
Chabahar Port
International North-South Transport Corridor
INSTC
Bilateral Relations
Trade
Strategic Partnership
Ali Akbar Ahmadian

More Telugu News