Harish Chauhan: టర్కీ యాపిల్స్ దిగుమతిపై నిషేధం విధించండి: హిమాచల్ రైతుల డిమాండ్!

Harish Chauhan demands ban on Turkey apple imports
  • పాకిస్థాన్‌కు టర్కీ మద్దతివ్వడమే ప్రధాన కారణం
  • "శత్రువుకు మిత్రుడు మనకూ శత్రువే" అంటున్న ఉత్పత్తిదారులు
  • గవర్నర్ ద్వారా రాష్ట్రపతి, పీఎంవోలకు వినతి పత్రం
  • ఇతర దేశాల యాపిల్స్‌పై సుంకం పెంచాలనీ కోరిక
  • దేశీయ రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం
పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతోందన్న కారణంతో టర్కీ నుంచి యాపిల్ పండ్ల దిగుమతిని తక్షణమే నిషేధించాలని హిమాచల్‌ ప్రదేశ్‌ పండ్ల ఉత్పత్తిదారుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు హిమాచల్‌ ప్రదేశ్‌ పండ్ల ఉత్పత్తిదారుల సంయుక్త్‌ మంచ్‌ (హిమాచల్ ఫ్రూట్ గ్రోయర్స్) ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా ద్వారా రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు.

'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ బహిరంగంగా మద్దతు తెలపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పండ్ల ఉత్పత్తిదారుల సంఘం తమ ప్రకటనలో పేర్కొంది. "భారత్‌కు యాపిల్స్ అధికంగా ఎగుమతి చేసే దేశాల్లో టర్కీ కూడా ఒకటి. ప్రతీ సంవత్సరం సుమారు రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల విలువైన యాపిల్స్‌ను మనం టర్కీ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు టర్కీ అండగా నిలవడం దారుణం. 'శత్రువుకు మిత్రుడు మనకు కూడా శత్రువే' అనే సూత్రాన్ని అనుసరించి, టర్కీ నుంచి అన్ని రకాల దిగుమతులపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలి" అని సంఘం తమ వినతిపత్రంలో కోరింది.

ఈ విషయంపై సంఘం అధ్యక్షుడు హరీశ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ, "టర్కీ అందించిన డ్రోన్లను ఉపయోగించే పాకిస్థాన్‌ భారత్‌పై దాడులకు పాల్పడింది. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించాలి. టర్కీ నుంచి ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధిస్తే, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని పండ్ల ఉత్పత్తిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది" అని వివరించారు.

అంతేకాకుండా, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న యాపిల్స్‌ను ప్రజలు తినకూడదని కూడా హరీశ్‌ చౌహాన్‌ సూచించారు. ఇప్పటికే రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు టర్కీ మార్బుల్స్ దిగుమతులపై నిషేధం విధించారని, చాలా మంది పర్యాటకులు తమ ప్రయాణ జాబితా నుంచి టర్కీని తొలగించుకున్నారని ఆయన గుర్తు చేశారు.

టర్కీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు చేసుకోవాలనుకున్న వారు కూడా తమ ప్రణాళికలను మార్చుకున్నారని తెలిపారు. ఇతర దేశాల నుంచి యాపిల్స్ దిగుమతులపై సుంకాన్ని పెంచాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే పండ్లపై సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 50 శాతం నుంచి 100 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తగిన నిర్ణయం తీసుకుంటారని సంయుక్త్‌ మంచ్‌ అధ్యక్షుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
Harish Chauhan
Turkey
Apple import ban
Himachal Pradesh
Fruit growers association

More Telugu News