Pawan Kalyan: బహుశా ఆయనకు ఉన్నంత అర్హత నాకు లేదేమో!: పవన్ కల్యాణ్

Pawan Kalyan Speech on World Environment Day in Amaravati
  • నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
  • అమరావతిలోని అనంతవరంలో కార్యక్రమం
  • సీఎం చంద్రబాబుతో పాటు హాజరైన పవన్ కల్యాణ్
  • పర్యావరణ పరిరక్షణే ధ్యేయమని ఉద్ఘాటన
  • వచ్చే ఏడాదిలోగా కోటి మొక్కలు నాటుతానని ప్రతిజ్ఞ
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషిగా వచ్చే ఏడాది ఇదే రోజు నాటికి రాష్ట్రంలో కనీసం కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఆయన ప్రకటించారు. అడవుల్లో కార్చిచ్చులను నివారించడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం వంటి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

ఈ సందర్భంగా పర్యావరణవేత్త కుమెర అంకారావు సేవలను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "14 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ఒక పక్షి చనిపోవడం చూసి చలించిపోయి, మూడు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు అంకితమైన కుమెర అంకారావు గారి నిబద్ధత ప్రశంసనీయం. ఆయనకున్నంత అర్హత బహుశా నాకు లేదేమో అనిపిస్తుంది" అంటూ పవన్ వినమ్రంగా వ్యాఖ్యానించారు. నల్లమల అడవుల పరిరక్షణ కోసం అంకారావు చేస్తున్న కృషి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. అటువంటి వ్యక్తిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, అధికారులకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.

పర్యావరణ పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు స్ఫూర్తి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. "చెట్టు-నీరు" వంటి కార్యక్రమాల ద్వారా చంద్రబాబు పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశారని, ఆయన మార్గదర్శకత్వంలో పర్యావరణ మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. "ప్రస్తుతం అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలు నా వద్ద ఉన్నాయి. వచ్చే ఏడాది ఇదే సమయానికి కోటి మొక్కలు నాటడమే కాకుండా, అడవుల్లో కార్చిచ్చులను అరికట్టి, గొర్రెలు, మేకల కాపరులకు అవగాహన కల్పించి, అడవుల నరికివేతను తగ్గించి, అప్పుడు మరింత అనుభవంతో మీ ముందుకొచ్చి మాట్లాడతాను" అని పవన్ కల్యాణ్ అన్నారు.

చెట్లు మన జీవితంలో ఎంత కీలకమో వివరిస్తూ, "ఒకప్పుడు ఇళ్లకు దారి చెప్పాలంటే మర్రిచెట్టునో, గోరింటాకు చెట్టునో ఆనవాలుగా చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చెట్లు లేని జీవితాన్ని ఊహించుకోలేం. అవి కేవలం పక్షులకే కాదు, ప్రతి ఒక్కరికీ ఆధారం" అని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం పచ్చదనం సాధించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యాన్ని చేరుకోవడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. "ముఖ్యమంత్రి గారు మా అందరికీ రాష్ట్రంలో 33 శాతం కాకుండా, 50 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని లక్ష్యం నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్‌ను పర్యావరణ పరిరక్షణలో, అటవీ సంరక్షణలో, నగర వనాల్లో తలమానికంగా నిలపడానికి మనమందరం కృషి చేద్దాం" అని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చే సూచనలు, సలహాలు స్వీకరించి, వచ్చే ఏడాదికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుని ఆయన మెప్పు పొందేలా పనిచేస్తామని పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.
Pawan Kalyan
Andhra Pradesh
environment
forests
Kumera Ankurao
Chandrababu Naidu
plantation
Amaravati
environmental protection
trees

More Telugu News