EPFO: అలా చేయొద్దు.. పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్‌ఓ హెచ్చరిక!

EPFO Alerts Subscribers About Third Party Agents for PF Services
  • పీఎఫ్ సేవల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దన్న‌ ఈపీఎఫ్‌ఓ
  • థర్డ్ పార్టీ ఏజెంట్ల వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం బయటపడే ప్రమాదం
  • అధికారిక పోర్టల్, ఉమాంగ్ యాప్ ద్వారా ఉచితంగా సేవలు పొందాలని సూచన
  • కొన్ని సైబర్ కేఫ్‌లు, ఫిన్‌టెక్ సంస్థలు అధిక రుసుములు వసూలు చేస్తున్నాయని గుర్తింపు
  • చందాదారుల సౌలభ్యం కోసం పలు సేవలను సరళతరం చేసిన ఈపీఎఫ్‌ఓ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తమ చందాదారులకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించిన ఎలాంటి సేవల కోసమైనా థర్డ్ పార్టీ ఏజెంట్ల సహాయం తీసుకోవద్దని గట్టిగా హెచ్చరించింది. ఇలా చేయడం వల్ల తమ వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఈపీఎఫ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి బదులుగా చందాదారులందరూ ఈపీఎఫ్‌ఓ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉన్న సేవలను నేరుగా వినియోగించుకోవాలని సూచించింది. ఈ సేవలు సులభంగా, వేగంగా, పారదర్శకంగా ఉంటాయని స్పష్టం చేసింది.

కొన్ని సైబర్ కేఫ్‌లు, కొన్ని ఫిన్‌టెక్ సంస్థలు ఈపీఎఫ్‌ఓ సేవలను అందించే పేరుతో చందాదారుల నుంచి అధిక మొత్తంలో రుసుములు వసూలు చేస్తున్న విషయం కార్మిక శాఖ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి ఈపీఎఫ్‌ఓ ఉచితంగా అందించే సేవలకే ఈ ఏజెంట్లు డబ్బులు గుంజుతున్నారని కార్మిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి థర్డ్ పార్టీ సేవల వల్ల ఆర్థిక సమాచారం దుర్వినియోగమయ్యే ఆస్కారం కూడా ఉందని హెచ్చరించింది. తమకు ఎలాంటి అధీకృత థర్డ్ పార్టీ సంస్థలు లేవని ఈపీఎఫ్‌ఓ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది.

క్లెయిమ్ సెటిల్‌మెంట్, కేవైసీ అప్‌డేట్, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవల కోసం చందాదారులు, యాజమాన్యాలు, పెన్షనర్లు నేరుగా ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్ (www.epfindia.gov.in) లేదా ఉమాంగ్ యాప్‌ను ఉపయోగించాలని సంస్థ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఏవైనా సమస్యలు ఎదురైతే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న హెల్ప్‌డెస్క్ ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని తెలిపింది.

చందాదారుల కోసం ఈపీఎఫ్‌ఓ ఇటీవల చేసిన కొన్ని కీలక మార్పులు..
ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్: అనారోగ్యం, వివాహం, పిల్లల చదువులు వంటి అవసరాల కోసం తీసుకునే అడ్వాన్స్ పరిమితిని రూ.1 లక్షకు పెంచారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ విధానం ద్వారా సుమారు 2.34 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది.
ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్: 2025 జనవరి 15 నుంచి పీఎఫ్ ఖాతా బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. దీనికోసం ఇకపై యాజమాని ఆమోదం అవసరం లేదు.
ఆధార్ ఆధారిత నవీకరణ: ఆధార్ అథంటికేషన్ ద్వారా ప్రొఫైల్‌లో మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల యజమానిపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది.
ఫేస్ అథంటికేషన్: ఉమాంగ్ యాప్‌లో ఫేస్ అథంటికేషన్ టెక్నాలజీ ద్వారా యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) కేటాయింపు, యాక్టివేషన్ ప్రక్రియను సులభతరం చేశారు.
బ్యాంక్ వివరాలు: బ్యాంక్ ఖాతా వివరాలను అనుసంధానించడానికి చెక్ లీఫ్ లేదా అటెస్ట్ చేసిన పాస్‌బుక్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరాన్ని తొలగించారు. దీనికి యాజమాని ఆమోదం కూడా ఇప్పుడు అవసరం లేదు.
EPFO
Employees Provident Fund Organisation
PF
Provident Fund
UAN
Umang App
Auto Claim Settlement
Aadhar Authentication
PF Account Transfer
Labour Department

More Telugu News