AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్... 13 మందిపై కఠిన చర్యలు

AIIMS Mangalagiri Ragging Incident Strict Action Against 13 Students
  • మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్‌పై కఠిన చర్యలు
  • 13 మంది సీనియర్ విద్యార్థులను దోషులుగా నిర్ధారణ
  • ఒక్కొక్కరికీ రూ. 25 వేల చొప్పున భారీ జరిమానా
  • విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేసిన యాజమాన్యం
  • క్షమాపణ పత్రాలు రాయించుకున్న అధికారులు
  • సంస్థాగత విచారణ పూర్తి, పోలీసుల విచారణ పెండింగ్
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకున్నట్లు యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ఘటనకు బాధ్యులుగా తేలిన 13 మంది సీనియర్ వైద్య విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణారెడ్డి వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే, జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఎయిమ్స్ యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో, 13 మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు అమలు చేసినట్లు డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. బాధ్యులైన విద్యార్థుల నుంచి క్షమాపణ లేఖలు స్వీకరించడంతో పాటు, వారిని హాస్టల్ నుంచి బహిష్కరించినట్లు చెప్పారు. అంతేకాకుండా, ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున జరిమానా విధించినట్లు ఆయన వివరించారు.

జూన్ 22న ర్యాగింగ్ ఘటన జరిగిన రోజే పోలీసులకు ప్రాథమిక సమాచారం అందించామని వంశీకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తమ వైపు నుంచి విచారణ ప్రక్రియ పూర్తిగా ముగిసిందని, ఇక పోలీసుల విచారణ మాత్రమే మిగిలి ఉందని అన్నారు. పోలీసుల నుంచి స్పందన ఆలస్యమైతే దానికి తమ బాధ్యత కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తు, సంస్థ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించాలని కోరారు. బాధితులు, నిందితుల పేర్లను బయటపెట్టవద్దని సూచించారు. తాము ఈ విషయంలో ఎటువంటి ఉపేక్ష చూపలేదని, పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
AIIMS Mangalagiri
Mangalagiri AIIMS
AIIMS Ragging
Ragging case
Medical students
Guntur
Andhra Pradesh
Vamsi Krishna Reddy
Crime news
Student discipline

More Telugu News