'వ్యవస్థ' - ఓటీటీ రివ్యూ
Movie Name: Vyavastha
- జీ 5 ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన 'వ్యవస్థ'
- న్యాయవ్యవస్థ నేపథ్యంలో నడిచే తెలుగు వెబ్ సిరీస్
- కొత్తదనం లేని కథ .. ఆసక్తికరంగా సాగని కథనం
- అంతా తానై నడిపించిన సంపత్ రాజ్
- సన్నివేశాల సాగతీత ... కనిపించని ట్విస్టులు
ఈ వ్యవస్థను ఎవరూ మార్చలేరు .. నీతికీ .. న్యాయానికి రోజులు లేవు. అనే మాటలు తరచూ ఎక్కడో ఒక చోట .. ఏదో ఒక సందర్భంలో వింటూ ఉంటాము. అలాంటి వ్యవస్థను తమకి అనుకూలంగా మార్చుకుని ఎదిగే పెద్దమనుషులు కొందరైతే, ఆవేశాన్ని అణచుకుంటూ ఆవేదనతో జీవితాన్ని గడిపే మధ్యతరగతి వారు కొందరు. అలాంటి ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు, అవినీతిని ఆశ్రయంగా చేసుకున్న పెద్దమనుషులపై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో 'జీ 5'వారు రూపొందించిన వెబ్ సిరీస్ నే 'వ్యవస్థ'. నిన్ననే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది.
కథలోకి వెళితే .. వంశీ (కార్తీక్ రత్నం) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. లాయర్ చక్రవర్తి (సంపత్ రాజ్) వంశీ తండ్రి పనిచేస్తూ ఉంటాడు. హైదరాబాద్ లోని శ్రీమంతులలో చక్రవర్తి ఒకడు. నగరంలోని ప్రముఖ లాయర్లందరినీ అయన తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఆయన వదిలేసిన కేసును టేకప్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. తనని ఎదిరించినవారి అంతుచూసే వరకూ అతను వదిలిపెట్టడు.
సంపన్నుల జాబితాలో తన పేరు చూసుకోవాలనేది ఆయన కోరిక. అందుకోసం నైతిక విలువలను కూడా చాలా తేలికగా వదిలేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే వంశీ ఓ దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడ అతనికి యామిని (హెబ్బా పటేల్) తారసపడుతుంది. తొలి చూపులోనే ఆయన మనసు పారేసుకుంటాడు. ఆమె కోసమే తనకి ఇష్టం లేకపోయినా, లా కాలేజ్ లో జాయిన్ అవుతాడు. అయితే ఆమె 'లా' మానేసి ప్యారిస్ వెళ్లిపోయిందని తెలుసుకుని బాధపడతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో 'లా' పూర్తి చేస్తాడు.
తండ్రి చేసిన ఒక పొరపాటు కారణంగా ఆయనకి బదులుగా, తను చక్రవర్తి దగ్గర పనిచేయవలసి వస్తుంది. అయితే చక్రవర్తి నిజస్వరూపం అర్థమయ్యాక అక్కడ పనిమానేయాలని అనుకుంటాడు. అదే సమయంలో చక్రవర్తిని కలవడానికి వచ్చిన 'యామిని'ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె ఒక శ్రీమంతురాలనీ .. ఫస్టు నైట్ రోజునే భర్తను షూట్ చేసి చంపేసిందని తెలుసుకుంటాడు. అవినీతి పరుడైన చక్రవర్తి వలన ఆమెకి అన్యాయమే జరుగుతుందని భావించిన ఆయన, తనే ఆమెను కాపాడుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం వంశీ ఏం చేస్తాడు? పర్యవసానంగా ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ.
పట్టాభి చిలుకూరి నిర్మించిన ఈ వెబ్ సిరీస్, నిర్మాణ విలువల పరంగా మంచి మార్కులను కొట్టేస్తుంది. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో, సీజన్ 1 క్రింద 8 ఎపిసోడ్స్ ను వదిలారు. ఈ 8 ఎపిసోడ్స్ లోని కథ హెబ్బా పటేల్ గురించే జరుగుతూ ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఆమె పాత్ర అప్పుడప్పుడు తొంగిచూసి వెళుతుంటుంది. ఇక సంపత్ రాజ్ - కార్తీక్ రత్నం పాత్రలే కథను నడిపిస్తూ ఉంటాయి. యామినీని ఆ కేసు నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో వంశీ ఉంటే, తాను ఎలాంటి పరిస్థిలోతుల్లోను అతనిపై ఓడిపోకూడదనే పట్టుదలతో చక్రవర్తి ఉంటాడు.
దర్శకుడు ఆనంద్ రంగా ఎంచుకున్న కథ కొత్తదేమీ కాదు. ఈ జోనర్ .. ఇలాంటి సన్నివేశాలు .. వ్యూహాలు ... ప్రతి వ్యూహాలు ఇంతకుముందు చూసినవే. కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో నడిచే సీన్స్ ఒకటి రెండూ ఉంటేనే బోరింగ్ గా ఫీలయ్యే ట్రెండ్ ఇది. అలాంటిది ఈ కథ అంతా కూడా కోర్టు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక కథను ఈ ట్రెండులో చెప్పడానికి ట్రై చేయడం నిజంగా సాహసమే అవుతుంది. ఈ దర్శకుడు అలాంటి సాహసమే చేశాడు.
సాధారణంగా కోర్టులు .. కేసులు .. సెక్షన్లు .. సాక్ష్యాలు .. ఆధారాలు ఇలాంటి హడావిడిని ఒక రేంజ్ లో టెన్షన్ బిల్డప్ చేస్తూ చూపించాలి. హీరోకి .. విలన్ కి మధ్య నువ్వా నేనా? అనే ఒక పరుగు కనిపించాలి. అలాంటి ఒక పరుగు కనిపించకపోవడం ఈ వెబ్ సిరీస్ లోని ఒక లోపంగా చెప్పుకోవచ్చు. కథలో కొత్తదనం లేదు ... స్క్రీన్ ప్లేలో వేగం కనిపించదు. ఫస్టు ఎపిసోడ్ ల్లోనే జూనియర్ ఆర్టిస్టుల నుంచి సరైన రియాక్షన్స్ తీసుకోవడంలో డైరెక్టర్ విఫలమయ్యాడనే విషయం అర్థమవుతుంది.
మొదటి 3 ఎపిసోడ్స్ కూడా ఎలాంటి హడావిడి లేకుండా కథనం నత్త నడక నడుస్తుంది. 4వ ఎపిసోడ్ నుంచి కథ కాస్త పుంజుకుంటుంది. ఇక ఆ తరువాత కూడా అంతగా ప్రాధాన్యత లేని సీన్స్ ఉన్నా, 'ఇప్పుడు కాస్త బెటర్' అనుకుంటూ ఫాలో కావొచ్చు. ఈ వెబ్ సిరీస్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసినప్పటికీ సంపత్ రాజ్ నే హీరోగా కనిపిస్తాడు. ఆయన చుట్టూ ఆయన స్థాయి ఆర్టిస్టులు లేకపోవడం మరో లోపంగా కనిపిస్తుంది. ఆయన ముందుకు ఏ పాత్ర వచ్చినా తేలిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక హెబ్బా పటేల్ పై హీరోకి ప్రేమ పుట్టడానికి సరైన కారణం కనిపించదు. ఆయన పాత్రను డిజైన్ చేసే విషయంలో డైరెక్టర్ తడబడ్డాడనే విషయం అర్థమవుతూనే ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకూ ఎక్కడా కూడా నెక్స్ట్ ఏం జరగుతుందా అనే ఆసక్తి తలెత్తదు. ముఖ్యమైన పాత్రధారులు .. ఒకరిద్దరు సీనియర్ ఆర్టిస్టులు మినహా, మిగతా వారి నుంచి సరై ఎక్స్ ప్రెషన్స్ కూడా రాలేదు. నరేశ్ కుమరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫరవాలేదు. అనిల్ బండారి ఫొటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ గా ఆది నారాయణ్ ట్రిమ్ చేయవలసిన సీన్స్ చాలానే ఉన్నాయి. 6 ఎపిసోడ్స్ లోనే ఈ కథ చెప్పేయవచ్చు.
ప్లస్ పాయింట్స్: నిర్మాణ విలువలు .. సంపత్ రాజ్ నటన .. ఫొటోగ్రఫీ.
మైనస్ పాయింట్స్ : కథలో బలం లేకపోవడం .. కథనంలో వేగం లేకపోవడం .. సంపత్ రాజ్ స్థాయికి తగిన ఆర్టిస్టులు లేకపోవడం .. హీరో పాత్రను డిజైన్ చేసే విషయంలో క్లారిటీ లోపించడం.