Chandrababu: వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు, రఘురామ కృష్ణంరాజు తాత హస్తం ఉంది: ‘జనసేన’ నేత హరిరామజోగయ్య

  • సిరీస్’ సుబ్బరాజు మనవడు రఘురామ కృష్ణంరాజు
  • రఘురామ కృష్ణంరాజు నాపై ఆరోపణలు చేశారు
  • అవసరమైన విషయాలను ప్రస్తావించాల్సిన బాధ్యత నాపై ఉంది

నాడు వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు, నరసాపురం వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న రఘురామ కృష్ణంరాజు తాత ‘సిరీస్’ సుబ్బరాజుల పాత్ర ఉందని పాలకొల్లు జనసేన పార్టీ నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టీవీ 99’ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ, ఇటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రఘురామ కృష్ణంరాజు గురించి ప్రజలు ఆలోచించాలని అన్నారు.

ఈ సందర్భంగా హరిరామజోగయ్య మాట్లాడుతూ, ఇది ఎన్నికల సమయం కనుక, అవసరమైన విషయాలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ విషయాన్ని తానేమీ కొత్తగా ప్రస్తావించడం లేదని, 2015 లో ‘నా రాజకీయ ప్రస్థానం’ అనే పుస్తకం రాశానని, అందులో కూడా ఈ విషయం ప్రస్తావించానని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ గుర్తుచేయడం చాలా అవసరం అనిపించిందని, ఈరోజు సాక్షి పేపర్ లో తనపై ఆరోపణలు చేస్తూ రఘురామ కృష్ణంరాజు ఓ ప్రకటన చేశారని, దీంతో, తాను మనస్తాపం చెందానని అన్నారు.

రఘురామ కృష్ణంరాజు చేసిన ఆరోపణలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరముందని, అందుకే, ఈ ప్రకటన చేశానని చెప్పారు. వంగవీటి రంగా హత్యకు చంద్రబాబు ఎంత కారణమో, సిరీస్ సుబ్బరాజు కూడా అంతే కారణమని ఆరోపించారు. అలాంటి కుటుంబం నుంచి ఎంపీగా పోటీ చేయడం సబబు కాదని, ఇలాంటి వ్యక్తిని పార్లమెంట్ కు పంపించడం అవసరమా? అని ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.  

  • Loading...

More Telugu News