Andhra Pradesh: ఏపీలో ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్ట్.. నిప్పులు చెరిగిన చంద్రబాబు!

  • ఇంత నిరంకుశత్వాన్ని నేనెప్పుడూ చూడలేదు
  • మా నేతల ఇంటిముందు ఇంతమంది పోలీసుల్ని పెడతారా?
  • టీడీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలియజేయాలి

తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి ఏపీ పోలీసులు అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, మాజీ మంత్రులు అఖిలప్రియ, అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరిని హౌస్ అరెస్ట్ చేయగా, మరికొందరిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఇంత నిరంకుశత్వాన్ని తాను గతంలో ఎన్నడూ చూడలేదని చంద్రబాబు తెలిపారు. శిబిరాల్లోని బాధితులకు ఆహారాన్ని కూడా అడ్డుకున్నారనీ, ఇంతకంటే అమానుషం ఏముంటుందని ప్రశ్నించారు. ‘ఒక్కో టీడీపీ నేత ఇంటి ముందు ఇంత మంది పోలీసులను పెడతారా? బాధితులకు పోలీసులను అండగా ఉంచితే ఈ పరిస్థితి అసలు వచ్చేదా? సొంత ఊరిలో నివసించేందుకు టీడీపీ శ్రేణులు చేస్తున్న పోరాటం ఇది.

సొంత భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం ఇది. దానిమ్మ, చీనీ, కొబ్బరిచెట్ల నరికివేత అన్నది ఎక్కడైనా ఉందా? బాధితులకు సంఘీభావంగా ప్రజలంతా అందరూ నిరసనల్లో పాల్గొనాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు రాష్ట్రమంతా శాంతియుతంగా, ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా నిరసనలు తెలియజేయాలని సూచించారు. బాధితులకు మద్దతుగా తాము చేస్తున్న పోరాటం ఆగదనీ, టీడీపీ డిమాండ్లను పరిష్కరించాల్సిందేని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News