Suresh Raina: ఆ రాత్రి భయంకర ఘటన జరిగింది.. మా అంకుల్‌ని నరికి చంపారు.. కజిన్ కూడా మృతి: సురేశ్ రైనా

Suresh Raina My uncle was slaughtered to death

  • పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌కు సురేశ్ రైనా ట్వీట్  
  • మా ఆంటీ పరిస్థితి చాలా విషమంగా ఉంది
  • ఈ ఘటనకు కారకులెవరో తెలియదు
  • ఈ ఘటనపై దృష్టిసారించాలని పోలీసులను కోరుతున్నాను

దుబాయిలో జరగనున్న ఐపీఎల్- 2020 నుంచి తప్పుకుని చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు సురేశ్ రైనా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ సీజన్‌కి దూరమవుతున్నాడని, సురేశ్ రైనాతో పాటు ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంటామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ ట్విట్టర్‌ ఖాతాలో ఇటీవల ప్రకటించింది.  

ఇదిలావుంచితే, ఇటీవల పంజాబ్ లోని సురేశ్ రైనా బంధువులపై ఇటీవల దోపిడీ దొంగల దాడి జరిగింది. దీని గురించి నేడు రైనా ట్వీట్ చేశాడు.

'పంజాబ్‌లోని మా బంధువులు భయంకర ఘటనను ఎదుర్కొన్నారు. మా అంకుల్‌ని నరికి చంపేశారు. మా ఆంటీతో పాటు ఇద్దరు కజిన్‌లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతూ దురదృష్టవశాత్తు మా కజిన్ గత రాత్రి మృతి చెందారు. మా ఆంటీ పరిస్థితి చాలా విషమంగా ఉంది' అని సురేశ్ రైనా పేర్కొన్నాడు.

'ఈ ఘటనకు కారకులెవరో, ఆ రాత్రి ఏం జరిగిందో ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై దృష్టి సారించాలని నేను పంజాబ్ పోలీసులను కోరుతున్నాను. ఈ హేయమైన చర్యకు ఎవరు బాధ్యులో తెలుసుకోవాల్సిన కనీస అర్హత మాకు ఉంది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారు తప్పించుకుని, మరో నేరం చేయడానికి వీల్లేదు' అంటూ పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌కు సురేశ్ రైనా ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News