T Natarajan: గాయంతో ఉమేశ్ అవుట్.... మరోసారి బంపర్ చాన్స్ కొట్టేసిన నటరాజన్

Natarajan to be replace injured pacer Umesh Yadav

  • రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్
  • ఉమేశ్ స్థానాన్ని నటరాజన్ తో భర్తీ చేయాలని నిర్ణయం
  • సమావేశమైన సీనియర్ సెలెక్షన్ కమిటీ
  • జనవరి 7 నుంచి ఆసీస్ తో మూడో టెస్టు

ఆస్ట్రేలియా పర్యటనలో గాయాల బారినపడిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ఉమేశ్ యాదవ్ కూడా చేరాడు. రెండో టెస్టు సందర్భంగా ఉమేశ్ గాయానికి గురయ్యాడు. ఇప్పటికే ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కాగా, ఇప్పుడు ఉమేశ్ కూడా షమీ బాటలోనే నడిచాడు.

కాగా, ఆస్ట్రేలియాతో భారత్ ఇంకా రెండు టెస్టులు ఆడాల్సి ఉండగా, ఉమేశ్ స్థానంలో తమిళనాడు లెఫ్టార్మ్ సీమర్ టి.నటరాజన్ ను జట్టులోకి ఎంపిక చేశారు. ఇటీవలే పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్ అమోఘంగా రాణించాడు.

ఇక సిరీస్ లో ఇప్పటివరకు 2 టెస్టులు జరగ్గా ఇరుజట్లు 1-1తో సమవుజ్జీగా ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టుల కోసం జట్టును ఎంపిక చేసేందుకు ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ సమావేశమైంది. షమీ స్థానంలో ఇప్పటికే ముంబయి పేసర్ శార్దూల్ ఠాకూర్ ను జట్టులో చేర్చిన సెలెక్టర్లు, తాజాగా ఉమేశ్ స్థానాన్ని నటరాజన్ తో భర్తీ చేయాలని నిర్ణయించారు. అటు, 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ జట్టుతో కలిశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ఈ నెల 7 నుంచి సిడ్నీలో జరగనుంది.

జట్టు సభ్యులు...

అజింక్యా రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, కుల్దీప్ యాదవ్.

  • Loading...

More Telugu News