Panchayat polls: పంచాయతీ సమరం.. ఏపీలో తొలి రోజు మొత్తంగా 3,515 నామినేషన్లు దాఖలు

3315 nominations filed in first day in andhrapradesh

  • సర్పంచ్ స్థానాలకు 1,315
  • వార్డు స్థానాలకు 2,200
  • కడప, నెల్లూరు జిల్లాల్లోని రెండు మండలాల్లో జీరో నామినేషన్లు
  • నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా, తొలి రోజు 1,315 సర్పంచ్, 2,200 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 248 నామినేషన్లు దాఖలు కాగా, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 27 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే, కడప జిల్లాలో రెండు, నెల్లూరులో రెండు మండలాల్లో సర్పంచ్ స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయకపోవడం గమనార్హం.

నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు దాడిచేసి అడ్డుకుంటున్నారని గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాంబొట్ల పాలేనికి చెందిన కొందరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్సై, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే గ్రామానికి చెందిన అక్కల నాగమణి అనే మహిళ గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీకి స్థానిక పోలీసులపై ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి తనకు నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు తిరిగి తనపైనే తప్పుడు కేసు పెట్టారని ఎస్పీ ఎదుట వాపోయారు.

  • Loading...

More Telugu News