Rahul Gandhi: కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi decides to cancel his rallies and meetings in Bengal in the wake of corona pandemic

  • భారత్ లో కరోనా విలయం
  • గత 24 గంటల్లో 2.61 లక్షల కేసులు
  • పశ్చిమ బెంగాల్ లో ఇంకా 3 విడతల ఎన్నికలు
  • సభలు, రోడ్ షోలు రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ
  • ఇతర నేతలు కూడా దీనిపై ఆలోచించాలని పిలుపు

దేశంలో కరోనా వ్యాప్తి పతాకస్థాయికి చేరుకుంది. సెకండ్ వేవ్ బీభత్సకరంగా కొనసాగుతోన్న నేపథ్యంలో దేశంలో లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో 5 విడతల అసెంబ్లీ ఎన్నికలు ముగియగా, మరో 3 విడతలు మిగిలున్నాయి. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తాను బెంగాల్ లో సభలు, సమావేశాల్లో పాల్గొనబోనని రాహుల్ గాంధీ ప్రకటించారు.

బెంగాల్ లో తాను పాల్గొనాల్సిన అన్ని సభలను రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. రాజకీయ నేతలందరూ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని, భారీ ప్రజానీకంతో సభలు, సమావేశాలు, రోడ్ షోలు ఏర్పాటు చేస్తే వచ్చే పర్యవసానాలపై లోతుగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాహుల్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

పశ్చిమ బెంగాల్ లో ప్రధాన పోటీ అంతా అధికార టీఎంసీ, బీజేపీ మధ్యే నెలకొంది. ఇప్పుడు రాహుల్ సభలు రద్దు చేసుకున్నా కాంగ్రెస్ కు కలిగే నష్టం ఏమీ ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News