India: మీ ఉగ్రవాదం.. మా ఉగ్రవాదం అనే చట్రంలోకి వెళ్లొద్దు: ఐరాసలో భారత ప్రతినిధి

Dont Return To Era Of Your Terrorists And My Terrorists India At UN

  • 9/11 తర్వాత ఇప్పుడు పేర్లు పెడుతున్నారని ఆక్షేపణ
  • ప్రపంచాన్ని విడగొట్టే ప్రయత్నాలు
  • సమష్టిగా పోరాడాలని పిలుపు

అమెరికాలో 9/11 ఉగ్రవాద దాడులు జరిగిన 20 ఏళ్ల తరువాత ఆ ఉగ్రవాదానికి వేర్వేరు పేర్లు పెడుతున్నారని ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆక్షేపించింది. ‘హింసాత్మక జాతీయవాదం’, ‘రైట్ వింగ్ తీవ్రవాదం’ వంటి పేర్లను పెడుతున్నారని, కానీ, ఇప్పుడు ‘మీ ఉగ్రవాదం’, ‘మా ఉగ్రవాదం’ అనే గత చట్రంలోకి మళ్లీ వెళ్లొద్దని సూచించింది. ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఇవాళ ఐరాస సాధారణ సమావేశాల సందర్భంగా అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలపై (జీసీటీఎస్) జరిగిన ఏడో సమీక్షలో భారత శాశ్వత ప్రతినిధి/రాయబారి టి.ఎస్. తిరుమూర్తి మాట్లాడారు. 9/11 దాడుల తర్వాతే ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రపంచ దేశాలు కలిసి వచ్చాయని, వేరే ప్రాంతాల్లోని ఉగ్రవాదం, ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుందన్న విషయం అప్పుడే అందరికీ తెలిసొచ్చిందని ఆయన గుర్తు చేశారు.

రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రపంచాన్ని రెండుగా విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి విడిపోవడం వల్ల కలిగే అనర్థాలేంటో ఐరాసలోని సభ్య దేశాలు గత చరిత్ర ద్వారా తెలుసుకోవాలని, అన్ని దేశాలు కలిసి పోరాడితేనే ఉగ్రవాదాన్ని అంతం చేయగలమని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఆమోదించిన నిర్వచనాన్ని అందరూ ఆమోదించకపోవం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయన్నారు.

జీసీటీఎస్ తీర్మానాన్ని 15 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టారన్నారు. అంతర్జాతీయ శాంతి, భద్రతలను కాపాడడంలో అది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా క్షమించరాదని, ఎలాంటి ఉగ్రవాద చర్య అయినా కఠినంగా వ్యవహరించాల్సిందేనని తిరుమూర్తి స్పష్టం చేశారు. మతం, సిద్ధాంతాలు, వర్గాలు, వర్ణాల ఆధారంగా ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ పోతే.. ఉగ్రవాదులకు మరింత బలాన్నిచ్చినట్టేనని అన్నారు.

‘మతపర భయాల’ను ఈ ఏడో తీర్మానంలో ప్రవేశపెట్టారని, కానీ, భారత్ దానిని ఆమోదించబోదని తిరుమూర్తి స్పష్టం చేశారు. మూడు అబ్రహామిక్ మతాలనే ఇందులో పేర్కొన్నారని, కేవలం ఎంపిక చేసిన వాటినే ఎలా పేర్కొంటారని ఆయన ప్రశ్నించారు. బుద్ధిజం, సిక్కిజం, హిందూయిజంపై పెరిగిన ఉగ్రవాద దాడులను సభ ప్రస్తుత పత్రంలో పేర్కొనకపోవడం సరికాదని అన్నారు.

  • Loading...

More Telugu News