TRS: మహబూబాబాద్ ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట.. జైలు శిక్ష రద్దు

TS High Court Dismiss Lower Court Order on MP Malothu Kavitha

  • పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచారంటూ కేసు
  • ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించిన ప్రజా ప్రతినిధుల కోర్టు
  • ప్రధాన నిందితుడి వాంగ్మూలం చెల్లదంటూ జైలు శిక్షను రద్దు చేసిన హై కోర్టు

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచారంటూ నమోదైన కేసులో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో గతంలో ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేసింది. కవిత చెప్పడం వల్లే బూర్గమ్ పహాడ్ ఎస్సీ కాలనీలో డబ్బు పంచుతున్నానని అప్పట్లో ప్రధాన నిందితుడు మహ్మద్ షౌకత్ చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన ప్రజాప్రతినిధుల కోర్టు ఈ ఏడాది జులై 24న తీర్పు వెలువరిస్తూ మహ్మద్ షౌకత్, కవితలకు ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది.

దీంతో కోర్టు తీర్పును కవిత హైకోర్టులో సవాలు చేశారు. నిన్న విచారణ జరగ్గా.. ప్రధాన నిందితుడు మహ్మద్ షౌకత్ వాంగ్మూలంతోనే శిక్ష విధించారని, ఈ నేరాంగీకార వాంగ్మూలం చట్ట ప్రకారం చెల్లదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును రద్దు చేస్తూ జైలు శిక్షను రద్దు చేశారు.

  • Loading...

More Telugu News