Chandrababu: ఏపీ మరింత నాశనం కాకముందే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరాం: చంద్రబాబు

We requested President of India Ram Nath Kovind to impose president rule in AP says Chandrababu

  • టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతిని కోరాం
  • యువత నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది
  • రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేస్తున్నారు

టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరామని చంద్రబాబు తెలిపారు. ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని చెప్పారు.

దాడి చేసిన వెంటనే డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పేట్రేగిపోతోందని అన్నారు. డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో యువత నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.    

రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన ఉందని చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలపై కూడా దాడులు చేస్తున్నారని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు జడ్జీలతో పాటు ఇతర రంగాలపై దాడులు చేశారని అన్నారు. రాష్ట్ర సహజ సంపదను, వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. నానాటికీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతోందని అన్నారు. ఏపీలో పరిస్థితులు మరింత ఘోరంగా తయారవకముందే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్రపతిని కోరామని చెప్పారు.

  • Loading...

More Telugu News