Telangana: ఉపరితల ద్రోణి ప్రభావం.. తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

Moderate Rains Expected in Telangana today and tomorrow
  • నిన్న రాష్ట్రవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో వర్షాలు
  • మరోవైపు మండిపోయిన ఎండలు
  • ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • వడదెబ్బతో హనుమకొండ జిల్లాలో ఒకరి మృతి
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలుల్లో కొనసాగుతున్న అస్థిరత కారణంగా విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

నిన్న రాష్ట్రవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో అత్యధికంగా 44.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, వడదెబ్బతో నిన్న హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కుమ్మరిగూడేనికి చెందిన మేడి సమ్మయ్య (48) ప్రాణాలు కోల్పోయారు.
Telangana
Rains
Temperatures
Adilabad District

More Telugu News