Road Accident: చెట్టును ఢీకొన్న ట్రక్కు.. యూపీలో పదిమంది యాత్రికుల దుర్మరణం

 Road Accident In Pilibhit DCM Vehicle Overturned On The Highway

  • ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఘటన
  • హరిద్వార్ నుంచి వస్తుండగా ప్రమాదం
  • డ్రైవర్ నిద్రమత్తే కాణమంటున్న బాధితులు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది యాత్రికులు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పిలిభిత్‌లోని గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వస్తున్న డీసీఎం రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొని హైవేపై బోల్తా పడింది. ఈ ఘటనలో పదిమంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

బాధితులు హరిద్వార్ నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువమంది లఖింపూర్‌లోని గోలాకు చెందినవారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై పడిన డీసీఎంను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News