APSRTC: రన్నింగ్ లో ఊడిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చక్రాలు.. ప్రయాణికులు సురక్షితం

APS RTC Bus Tyres came out while bus running
  • ఏలూరు వెళ్తున్న నరసాపురం డిపో బస్సు
  • అజ్జమూరు వద్ద ఊడొచ్చిన బస్సు వెనక చక్రాలు
  • భారీ శబ్దంతో ఓ వైపునకు ఒరిగిపోయిన బస్సు
  • ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు
నరసాపురం డిపోకు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఏలూరు వెళ్తుండగా దాని చక్రాలు ఒక్కసారిగా ఊడి బయటకు వచ్చాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సును ఆపిన వెంటనే వారంతా బతుకు జీవుడా అనుకుంటూ కిందకు దిగారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బస్సు జాతీయ రహదారి మీదుగా ఏలూరు వెళ్తుండగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద బస్సు వెనక భాగంలో ఓ వైపున ఉన్న రెండు చక్రాలు ఊడి బయటకు వచ్చాయి. దీంతో భారీ శబ్దంతో బస్సు ఓ వైపునకు ఒరిగిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్సును ఆపేసిన డ్రైవర్ డిపో అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం అందులోని ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపారు.
APSRTC
West Godavari District
Akividu
APSRTC Bus

More Telugu News