Mocha: ఈ సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారనున్న 'మోఖా'

IMD says Mocha intensifies into severe cyclonic storm
  • బంగాళాఖాతంలో తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
  • మరింత బలపడుతోందన్న ఐఎండీ
  • బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా పయనం
  • మే 14 మధ్యాహ్నం నాటికి తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈ ఉదయం తుపానుగా మారింది. ఈ తుపానును 'మోఖా' అని పిలవనున్నారు. ఇది నేటి సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనుంది. 

ప్రస్తుతం ఇది పోర్టు బ్లెయిర్ కు పశ్చిమంగా 510 కిమీ, బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ కు దక్షిణ నైరుతి దిశగా 1,160 కిమీ దూరంలో, మయన్మార్ లోని సిట్వేకు దక్షిణ నైరుతి దిశగా 1,080 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. మోఖా తుపాను గంటకు 8 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. 

ఉత్తర దిశగా వెళుతూ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా మారనున్న మోఖా... ఆపై దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిక్కులో పయనిస్తూ ఈశాన్య బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ ప్రాంతాల మధ్య మే 14 మధ్యాహ్నం నాటికి తీరం దాటనుంది. 

దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులు, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, అసోం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. మోఖా తుపాను తీరం చేరే సమయంలో గంటకు 175 కిమీ వేగంతో దాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.
Mocha
Cyclonic Storm
Bay Of Bengal
IMD
Bangladesh
Myanmar
India

More Telugu News