Uttar Pradesh: విరిగిన రైలు పట్టాలు.. రైతు అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

UP farmer identifies crack on railway track in time averting major accident
  • ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ జిల్లా లాల్‌గోపాల్ గంజ్ ప్రాంతంలో విరిగిన పట్టాలు
  • ఉదయం పొలానికి వెళుతూ పట్టాలకున్న పగుళ్లను గుర్తించిన రైతు
  • వెంటనే ఎర్రటి వస్త్రాన్ని గాల్లో ఊపుతూ గోమతి ఎక్స్‌ప్రెస్‌ను ఆపిన వైనం
  • పెను ప్రమాదాన్ని తప్పించిన రైతుకు లోకోపైలట్ కృతజ్ఞతలు
రైలు పట్టాలు విరిగినట్టు గుర్తించిన ఓ రైతు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని భోలకాపురా గ్రామానికి చెందిన రైతు భన్వర్‌సింగ్ ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 6.00 గంటలకు తన పొలానికి బయలుదేరాడు. దారిలో లాల్‌గోపాల్‌గంజ్ సమీపంలోని రైల్వే ట్రాక్ పగిలి ఉండటాన్ని గుర్తించాడు. అదే సమయంలో ప్రయాగ్‌రాజ్ నుంచి బయలుదేరిన గోమతి ఎక్స్‌ప్రెస్ అదే ట్రాక్‌పై వస్తోంది. వెంటనే అప్రమత్తమైన రైతు తన వద్ద ఉన్న ఎర్రటి వస్త్రాన్ని గాల్లో ఊపుతూ రైలు ఆపాలంటూ గట్టిగా కేకలు వేశాడు. దీంతో, లోకోపైలట్ రైలును ఆపేశాడు. 

ఆ తరువాత విరిగిన పట్టాలను చూసి షాకయిపోయిన లోకోపైలట్ రైతును అభినందించాడు. పెను ప్రమాదం జరగకుండా నివారించావంటూ అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, ట్రాక్ పాడైన కారణంగా ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పట్టాలకు మరమ్మతులు పూర్తయ్యాక అధికారులు ఆ మార్గంలో రైలు సర్వీసులను పునరుద్ధరించారు.
Uttar Pradesh
Indian Railways

More Telugu News