Vamsi Krishna Yadav: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్

YCP MLC Vamsi Krishna Yadav joins Janasena

  • జనసేన తీర్థం పుచ్చుకున్న వంశీకృష్ణ యాదవ్
  • కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్
  • పవన్ సీఎం అయ్యేందుకు కృషి చేస్తానన్న వంశీకృష్ణ  
  • వంశీకృష్ణ గతంలో తనతో కలిసి యువరాజ్యంలో పనిచేశాడని వెల్లడించిన పవన్

విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వంశీకృష్ణ యాదవ్ కు పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. 

ఈ సందర్భంగా వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ... జనసేన పార్టీలోకి రావడంతో నాకు పార్టీ మారినట్టుగా అనిపించడంలేదు... సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు. గతంలో నేను పవన్ అన్న ఆధ్వర్యంలో ప్రజారాజ్యం యువజన విభాగంలో పనిచేశాను... ఇప్పుడు మళ్లీ అన్న నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అని వెల్లడించారు. 

 తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానిగానే ఉన్నానని, ఇప్పటికీ పవన్ కల్యాణ్ సినిమా విడుదలైతే మొదటి రోజే సినిమా చూస్తానని వెల్లడించారు.


ఉత్తరాంధ్రలో, విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు, పవన్ కల్యాణ్ ను సీఎంగా చేసేందుకు సర్వశక్తులు ధారపోస్తాను అని తెలిపారు. విశాఖ ప్రజలందరూ నా నిర్ణయాన్ని స్వాగతిస్తారని నమ్ముతున్నాను అని వివరించారు.

ఇక, వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి రావడం పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు. వంశీకృష్ణ యాదవ్ చాలా బలమైన నాయకుడు అని కొనియాడారు. వంశీకృష్ణ యాదవ్ తనకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి అని, గతంలో యువరాజ్యంలో కలిసి పనిచేశామని చెప్పారు. 

స్వల్ప తేడాతో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయి, మళ్లీ ఎమ్మెల్సీగా గెలిచారని వివరించారు. ఇప్పుడాయనకు సొంత కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గతంలో యువరాజ్యంలో పనిచేసిన చాలామంది యువనేతలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బలమైన నాయకులుగా ఉండడం చూస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News