Telangana: ఆ కంపెనీ ద్వారా తెలంగాణలో కొత్త బ్రాండ్ బీర్: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపణ

Manne Krishank fires at congress government over new company brand beer

  • తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్‌లకు అనుమతివ్వలేదని మంత్రి జూపల్లి చెప్పారన్న క్రిశాంక్
  • తెలంగాణ ప్రభుత్వం సోమ్ డిస్టలరీస్‌కు అనుమతించిందన్న బీఆర్ఎస్ నేత
  • ఈ కంపెనీ తెలంగాణకు వస్తున్న విషయం మంత్రికి తెలుసా? అని ప్రశ్న
  • మధ్యప్రదేశ్‌లో బ్యాన్ చేసిన కంపెనీకి తెలంగాణలో అనుమతిచ్చారని ఆగ్రహం

సోమ్ డిస్టలరీస్ కంపెనీ ద్వారా తెలంగాణలో కొత్త బీర్ కంపెనీని తీసుకువస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. మద్యం తయారీ కంపెనీ సోమ్ డిస్టలరీస్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై సోమవారం క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్‌లకు అనుమతి ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారని, కానీ ఆయన మాటలు అబద్ధమని తేలిపోయాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సోమ్ డిస్టలరీస్‌లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అవినీతికి పాల్పడ్డారని... ఇందుకు సంబంధించి గతంలో కేసు నడిచిందన్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ సంస్థను సీజ్ చేశారన్నారు. ఆ కంపెనీ మీద అనేకసార్లు రైడ్స్ జరిగినట్లు తెలిపారు. 2013-14లో రూ.25 లక్షలు, 2019లో రూ.1.31 లక్షలు సోమ్ డిస్టలరీస్... కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేస్తే... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్రమ మద్యానికి తలుపులు తెరిచిందని ధ్వజమెత్తారు.

సోమ్ డిస్టలరీస్ కంపెనీ తెలంగాణకు వస్తున్న విషయం మంత్రి జూపల్లికి తెలుసా? అని ప్రశ్నించారు. ఆ కంపెనీకి తెలంగాణలో బీర్లు అమ్మడానికి సీఎం రేవంత్ రెడ్డి డీల్ చేసి అనుమతి ఇచ్చారా? అని నిలదీశారు. సోమ్ డిస్టలరీస్ కంపెనీ కారణంగా మధ్యప్రదేశ్‌లో 65 మంది చనిపోయారన్నారు. అందుకే అక్కడ ఆ కంపెనీని బ్యాన్ చేశారన్నారు. అలాంటి కంపెనీకి తెలంగాణలో ఎలా అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News