KTR: హైడ్రా బాధితులకు అండగా ఉంటాం... అక్కడకు రండి: కేటీఆర్

KTR says will support hydra victims

  • హైడ్రా బాధితులకు బీఆర్ఎస్, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుందన్న కేటీఆర్
  • బాధితులు బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ కార్యాలయానికి రావాలని సూచన
  • లేదంటే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కలవాలన్న కేటీఆర్

హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామని, ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఆఫీస్... తెలంగాణ భవన్‌కు రావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైడ్రా బాధితులందరికీ తప్పకుండా తమ పార్టీ, తమ పార్టీ న్యాయవిభాగం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

తమ పార్టీ కార్యాలయం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10, రోడ్డు నెంబర్ 12 మధ్యలో ఉంటుందని, బాధితులు అక్కడికి రావొచ్చని సూచించారు. అక్కడ తమ న్యాయవిభాగం సహకారం అందిస్తుందన్నారు. తమకు ఓటు వేసి గెలిపించినందుకు హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

అక్కడకు రాలేని పరిస్థితుల్లో హైదరాబాద్‌లో దాదాపు అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్పోరేటర్లే ఉన్నారని, వారి వద్దకు వెళ్లవచ్చన్నారు. న్యాయపరంగా అండగా ఉంటామన్నారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాలని న్యాయస్థానం ద్వారానే ప్రభుత్వానికి చెప్పిస్తామని తెలిపారు. 

పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారని ఆరోపించారు. సామాన్యుల పట్ల అమానవీయంగా ప్రవర్తించడం దారుణం అన్నారు. ఫుట్‌పాత్‌లపై చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వారు చాలా చిన్న చిన్న వాళ్లేనని అన్నారు. ఆక్రమణల తొలగింపు మంచిదే కానీ... ప్రత్యేకంగా వెండింగ్ జోన్‌ను ఏర్పాటు చేసి వారిని అక్కడి నుంచి పంపించాలని సూచించారు. 

కోటీశ్వరుల ఆక్రమణలు కూల్చివేస్తే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని... కానీ సామాన్యులు ఇబ్బంది పడతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ శాఖ ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. కొంతమంది నివాసాలు రిజిస్ట్రేషన్ అయిన మూడు రోజులకే కూల్చివేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక సర్కస్ నడుపుతున్నారా? అని నిలదీశారు.

ఈ ప్రభుత్వానికి దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. అందుకే అన్యాయం జరుగుతున్న వారికి అండగా ఉండాలని తాము నిర్ణయించుకున్నామన్నారు. తాము పేదల వద్దకు వెళ్లి... బుల్డోజర్లను అడ్డుకుంటామన్నారు. తాము ఆక్రమణలను ప్రోత్సహించడం లేదని, కానీ మానవీయ కోణంలో ఆలోచించాలని సూచిస్తున్నామన్నారు. 

అయినా, ఆక్రమణలు అన్నీ కాంగ్రెస్ వారివే ఉంటాయని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఆక్రమణలన్నింటినీ కూలగొట్టాలని ప్రభుత్వం భావిస్తే జీహెచ్ఎంసీ కార్యాలయం నాలా మీదనే ఉందని గుర్తించాలన్నారు. మంత్రులు ఇళ్లు, ఫామ్ హౌస్‌లు కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయని ఆరోపించారు.

కుదురుపాకలో స్కూల్‌ భవనాన్ని ప్రారంభిస్తున్నానని కేటీఆర్ ట్వీట్

పెద్దపల్లి జిల్లాలోని కుదురుపాకలో కేటీఆర్ ఈ రోజు స్కూల్‌ భవనాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తన గ్రాండ్ పేరెంట్స్ జె.కేశవరావు, లక్ష్మీల జ్ఞాపకార్థం ఈ స్కూల్ భవంతిని నిర్మించినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News