Mohan babu: హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు

Manchu Mohan Babu Filed Lunch Motion Petition In Telangana HIgh Court
  • పోలీసుల నోటీసులపై లంచ్ మోషన్ పిటిషన్
  • సెక్యూరిటీ కోరినా కనీస భద్రత కల్పించలేదని పోలీసులపై ఆరోపణలు
  • తన నివాసం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటుకు విజ్ఞప్తి
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు పంపించారు. బుధవారం ఉదయం విచారణకు రమ్మని పిలిచారు. దీంతో పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ  మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. తనకు భద్రత ఏర్పాటు చేయాలని, తన నివాసం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబు తరఫున లాయర్లు నగేశ్ రెడ్డి, మురళి మనోహర్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.

జల్ పల్లిలోని మంచు ఫ్యామిలీ ఫాంహౌస్ వద్ద మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు.. మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పహాడీ షరీఫ్ పోలీసులు బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నటుడు మోహన్ బాబుకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు రాచకొండ కమిషనరేట్ లో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. దీనిపై తాజాగా మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
Mohan babu
High Court
Manchu family
Manchu Manoj
Vishnu

More Telugu News