Supreme Court: ఈడీ తీరుపై అసంతృప్తి... సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court Criticizes EDs Investigation Tactics
  • ఆధారాలు చూపకుండా అభియోగాలు మోపడంపై సుప్రీంకోర్టు అసహనం
  • ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణం కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యలు
  • నిందితుడికి కంపెనీతో సంబంధం ఉందని ఈడీ చెప్పలేకపోయిందన్న సుప్రీంకోర్టు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొన్ని కేసుల దర్యాప్తు చేస్తున్న తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన, పక్కా ఆధారాలు లేకుండానే కొందరు వ్యక్తులపై అభియోగాలు నమోదు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఓ నిందితుడి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

నిందితుడు రూ.40 కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపణలు చేస్తున్న ఈడీ, అసలు ఆ వ్యక్తికి ఏ కంపెనీతో సంబంధం ఉందో స్పష్టంగా చెప్పలేకపోతోందని ధర్మాసనం విచారణ సమయంలో అసహనం వ్యక్తం చేసింది. "ఈడీపై మాకు చాలా ఫిర్యాదులు అందాయి. వాటిలో చాలా వరకు సరైన ఆధారాలను ప్రస్తావించకుండానే అభియోగాలు మోపుతున్నట్లు కనిపిస్తోంది" అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ధోరణి సరైంది కాదని సూచించింది.

ఇదే కేసులో గతంలో జరిగిన విచారణలోనూ సుప్రీంకోర్టు ఈడీ దర్యాప్తు తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. "దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మూడు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. నిందితుడిని కస్టడీలోనే ఉంచి శిక్షిస్తున్నారు. విచారణ ప్రక్రియనే శిక్షగా మార్చారు" అని అప్పుడు పేర్కొంది. సుదీర్ఘకాలం నిందితులను విచారణ పేరుతో నిర్బంధంలో ఉంచడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన సుమారు రూ.2,000 కోట్ల మద్యం కుంభకోణం రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలిగించిందని ఈడీ ఆరోపిస్తోంది. ఒక వ్యవస్థీకృత మద్యం సిండికేట్ భారీగా లబ్ధి పొందిందని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలను ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Supreme Court
ED
Enforcement Directorate
Chhattisgarh Liquor Scam
Money Laundering
Bhoopesh Baghel
Chaitanya Baghel
Investigations
Bail Petition
Criminial Probe

More Telugu News