MS Dhoni: ఢిల్లీలో నేడు చెన్నై- రాజస్థాన్ ఢీ: ధోనీ వర్సెస్ యువ సంచలనం వైభవ్ పోరుపైనే అందరి దృష్టి!

MS Dhoni vs Vaibhav Suryavanshi Focus in Chennai Rajasthan Clash
  • ప్లేఆఫ్స్‌పై ప్రభావం చూపని నామమాత్రపు పోరు
  • 43 ఏళ్ల ధోనీ, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మధ్య ఆసక్తికర పోటీ
  • ఢిల్లీలో ధోనీకి ఇదే చివరి మ్యాచ్ కావచ్చని అభిమానుల అంచనా
  • ఈ సీజన్‌లో అదరగొట్టిన వైభవ్‌కు, ధోనీ ముందు సత్తా చాటే అవకాశం
  • ధోనీ రిటైర్మెంట్‌పై కొనసాగుతున్న ఊహాగానాలు
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు ఇప్పటికే గల్లంతైనప్పటికీ నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ఫలితం టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా కొన్ని ఆసక్తికరమైన అంశాలు దీనికి ప్రాధాన్యం తీసుకొచ్చాయి. ముఖ్యంగా, టోర్నీలోని అత్యంత పెద్ద వయసు ఆటగాడు, చెన్నై సారథి 43 ఏళ్ల ఎంఎస్ ధోనీ, అత్యంత పిన్న వయస్కుడైన రాజస్థాన్ ఆటగాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మధ్య పోరు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

వాస్తవానికి, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఈ సీజన్‌లో ఢిల్లీలో మ్యాచ్ లేదు. అయితే, ఐపీఎల్ వారం రోజుల పాటు నిలిచిపోయి, తిరిగి ప్రారంభమైనప్పుడు మిగిలిన లీగ్ దశ మ్యాచ్‌లను కేవలం ఆరు నగరాలకే పరిమితం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ క్రమంలో రాజస్థాన్‌తో చెన్నై ఆడాల్సిన హోమ్ మ్యాచ్ ఢిల్లీకి మారింది. దీంతో, ఢిల్లీ అభిమానులకు తమ ఆరాధ్య ఆటగాడు ధోనీని చూసే అవకాశం దక్కింది. ఈ మైదానంలో ధోనీకి ఇదే చివరి మ్యాచ్ కావచ్చనే ఊహాగానాల నేపథ్యంలో వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చి 'తలా' ఆటను కనులారా వీక్షించాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఎవరిది పైచేయి?
ఈ మ్యాచ్‌లోని మరో ఆసక్తికరమైన అంశం ధోనీ, వైభవ్ సూర్యవంశీల మధ్య పోటీ. మార్చి 30న గువాహటిలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు వైభవ్ తుది జట్టులో లేడు. అయితే, మ్యాచ్ అనంతరం ధోనీని కలిసి మాట్లాడే అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ సీజన్ మధ్యలో అరంగేట్రం చేసిన వైభవ్ తన నిర్భయమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో ఒక రికార్డు సెంచరీతో సహా 195 పరుగులు చేసిన ఈ యువ కెరటం 219 స్ట్రైక్ రేట్‌తో అదరగొట్టాడు. తన ఆరాధ్య క్రికెటర్ ధోనీ ముందు మరోసారి సత్తా చాటి, ఈ సీజన్‌ను ఘనంగా ముగించాలని వైభవ్ పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటికే 13 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రాజస్థాన్‌కు ఇదే ఈ సీజన్‌లో చివరి మ్యాచ్.

ఈ వయసు వ్యత్యాసంపై మాజీ భారత ఓపెనర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సరదాగా ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు. "ఇది చాలా సరదాగా ఉంటుంది. మా పాపతో అన్నాను. 'చూడు.. వైభవ్ సూర్యవంశీకి 14 ఏళ్లే, నీకు 12 ఏళ్లు' అని. దానికి తను 'చూడండి నాన్నా.. ధోనీ ఇంకా ఆడుతున్నాడు' అంది. దాంతో నేను సంభాషణ ముగించేశాను" అని చోప్రా నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ధోనీ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు
ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాల నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో మ్యాచ్‌కు వస్తారని అంచనా. లీగ్ నిలిచిపోవడానికి ముందు తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై ధోనీ స్పందిస్తూ.. తన భవిష్యత్తుపై ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోనని చెప్పాడు. సీఎస్‌కే మ్యాచ్‌లకు దేశవ్యాప్తంగా స్టేడియాలు నిండిపోవడంపై కూడా ఆయన సరదాగా వ్యాఖ్యానించాడు. ఇదే తన చివరి సీజన్ అవుతుందో, లేదో తెలియకనే అభిమానులు వస్తున్నారని చమత్కరించాడు.

వచ్చే సీజన్‌లోనూ ధోనీని చూడొచ్చు
ఆకాశ్ చోప్రా, మాజీ భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ మాత్రం ధోనీ 2026లో కూడా ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. "గత కొన్ని సీజన్లుగా మనం దీని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇది అతని చివరి సీజన్ అవుతుందని నేను అనుకోవడం లేదు. విరామ సమయంలో తన శరీరం ఎలా సహకరిస్తుందో చూసి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు" అని ఆరోన్ అన్నాడు. "అతడు వచ్చే సీజన్‌లో తిరిగి వస్తాడు. 2026లో కూడా కెప్టెన్‌గా ఉండాలి" అని చోప్రా పేర్కొన్నాడు.

కాగా, తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను చెన్నైలోనే ఆడతానని ధోనీ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ సీజన్‌లో సీఎస్‌కే ఆడనున్న చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు (రెండింటికీ ధోనీనే కెప్టెన్) చెన్నైలో జరగడం లేదు. మే 25, ఆదివారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో సీఎస్‌కే తమ ఐపీఎల్ 2025 ప్రస్థానాన్ని ముగించనుంది.
MS Dhoni
Dhoni retirement
CSK vs RR
IPL 2025
Vaibhav Suryavanshi
Chennai Super Kings
Rajasthan Royals
Arun Jaitley Stadium
Aakash Chopra

More Telugu News