Chandrababu Naidu: విపత్తు నిర్వహణకు స్పేస్ టెక్నాలజీ సాయం... సీఎం చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ ఒప్పందం

Chandrababu Naidu Space Tech for Disaster Management ISRO RTGS Agreement
  • ఐదేళ్ల పాటు ఒప్పందం
  • AWARE ప్లాట్‌ఫామ్‌ను మరింతగా అభివృద్ధి
  • 42కి పైగా అప్లికేషన్లలో పనిచేయనున్న టెక్నాలజీ
ప్రభుత్వ పాలనలో స్పేస్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగువేసింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల పాటు సాగే ఈ ఒప్పందం ద్వారా శాటిలైట్ చిత్రాలు, శాస్త్రీయ సమాచారంతో AWARE ప్లాట్‌ఫామ్‌ను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. ఇది వ్యవసాయం, వాతావరణం, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక తదితర విభాగాల్లో 42కి పైగా అప్లికేషన్లలో పనిచేయనుంది. ఆధునిక సాంకేతికతలను సమన్వయం చేసి... విపత్తుల నిర్వహణలో మెరుగైన ఫలితాలు అందించి ప్రజల భద్రతకు దోహదపడుతుంది. 

AWARE ప్లాట్‌ఫామ్ శాటిలైట్‌లు, డ్రోన్లు, IoT పరికరాలు, సెన్సార్లు, మొబైల్ ఫోన్ల ఫీడ్, సీసీటీవీ వంటి వనరుల నుంచి డేటాను సమగ్రంగా సేకరించి ప్రజలకు SMS, WhatsApp రూపంలో తక్షణ హెచ్చరికలు, సూచనలు చేస్తుంది. ఈ ఒప్పంద ద్వారా ముఖ్యంగా విపత్తు నిర్వహణలో ప్రజలకు అత్యంత ఖచ్చితమైన సమాచారం త్వరితగతిన చేరవేసే అవకాశం లభిస్తుంది. ఇస్రో డైరెక్టర్ రాజరాజన్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ మధ్య జరిగిన కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

లక్ష మంది టెక్ అప్రెంటీస్ ల శిక్షణా కార్యక్రమం


దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ స్థితిగతులు, ఏపీలో టెక్ అవకాశాలపై నాస్కామ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. సచివాలయంలో నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ శ్రీనివాసన్ , నాస్కామ్ ఆర్ అండ్ డీ హెడ్ శివప్రసాద్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఐటీ రంగంలో ఏపీని ముందుకు తీసుకువెళ్లేందుకు స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని ప్రోత్సహించాల్సిన అంశాలపై సీఎం నాస్కామ్ ప్రతినిధులతో చర్చించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో సాంకేతికత జోడింపు వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఐటీ పరిశ్రమకు అవసరమైన టెక్ నిపుణుల్ని తయారు చేసేందుకు టెక్ అప్రెంటీస్ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా నాస్కామ్ ను సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్ లో  లక్ష మంది టెక్ అప్రెంటిస్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించటం ద్వారా ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను అందించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. 

విశాఖ, తిరుపతిలలో ఏఐ డిస్ట్రిక్ట్ టెస్ట్ బెడ్స్ 

విశాఖ, తిరుపతిలో జిల్లా స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రిక్ట్ టెస్ట్ బెడ్  ఏర్పాటుకు నాస్కామ్ ప్రతిపాదన చేసింది. భూ సంబంధిత అంశాలు, వైద్యారోగ్యం, విద్యా రంగాల్లో ఓపెన్ ఏఐ ల్యాబ్ లు ఏర్పాటు చేసి పౌరసేవల్ని అందించొచ్చని వెల్లడించింది. బిల్డ్ ఇండియా ఇన్నోవేషన్ పైప్ లైన్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేలా ఏపీలో గ్రామీణ టెక్ సొల్యూషన్స్ కు అవకాశం ఉందని నాస్కామ్ వివరించింది. వ్యవసాయం, వైద్యారోగ్యం, వాతావరణం ఇతర అంశాల్లో ఏఐ సాంకేతికతతో వందకు పైగా గ్రామీణ స్టార్టప్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు నాస్కామ్ ప్రతినిధులు సీఎంకు వివరించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Space Technology
ISRO
RTGS
Disaster Management
AWARE Platform
Artificial Intelligence
NASCOM
Tech Apprentices

More Telugu News