SS Rajamouli: వీడియో గేమ్‌లో జ‌క్క‌న్న‌.. అభిమానులకు రాజమౌళి సర్‌ప్రైజ్‌.. ఇదిగో వీడియో

SS Rajamouli to Appear in Death Stranding 2 Video Game
  • ప్రముఖ వీడియో గేమ్‌లో దర్శకుడు రాజమౌళి, కార్తికేయ
  • హిడియో కోజిమా రూపొందించిన 'డెత్‌ స్ట్రాండింగ్‌ 2'లో ఛాన్స్
  • ఈనెల‌ 26 నుంచి ప్లేస్టేషన్‌లో అందుబాటులోకి రానున్న గేమ్‌
  • జక్కన్నది వినోదాత్మక అతిథి పాత్ర అని ప్రచారం
  • ప్ర‌స్తుతం మహేశ్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రాజమౌళి
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాలతోనే కాకుండా అప్పుడప్పుడు ఇతర విషయాలతోనూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆయన ఓ అంతర్జాతీయ వీడియో గేమ్‌లో కనిపించనుండటం సినీ వర్గాల్లోనూ, ఆయన అభిమానుల్లోనూ ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించిన విజువల్స్, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వీడియో గేమ్‌ ప్రియులకు సుపరిచితమైన పేరు హిడియో కోజిమా. ఆయన సృష్టించిన 'డెత్‌ స్ట్రాండింగ్‌' గేమ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. ఇప్పుడు ఈ గేమ్‌కు కొనసాగింపుగా వస్తున్న "డెత్‌ స్ట్రాండింగ్‌ 2"లో రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ కూడా కనిపించనున్నారు. 

ఈ గేమ్‌లో ప్రముఖ హాలీవుడ్‌ నటులు నార్మన్‌ రీడస్‌, ఎల్లీ ఫానింగ్‌ వంటి వారు కూడా నటిస్తున్నారు. ఈ వీడియో గేమ్ ఈనెల‌ 26 నుంచి ప్లేస్టేషన్‌లో అందుబాటులోకి రానుంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్‌లో రాజమౌళిది ఓ వినోదాత్మకమైన అతిథి పాత్ర అని తెలుస్తోంది.

కాగా, రాజమౌళికి, గేమ్‌ డైరెక్టర్‌ హిడియో కోజిమాకు 2022లోనే పరిచయం ఏర్పడింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా జపాన్‌లో ఘనవిజయం సాధించిన సందర్భంగా రాజమౌళి జపాన్‌ వెళ్లినప్పుడు కోజిమాను కలిశారు. అప్పట్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే, అది కేవలం సినిమా పనుల్లో భాగంగానే జరిగి ఉంటుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు ఇలా వీడియో గేమ్‌లో రాజమౌళి ప్రత్యక్షం కానుండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మరోవైపు రాజమౌళి ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబుతో ఓ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. 'ఎస్‌ఎస్‌ఎంబీ29' అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. 

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌లో భాగంగా నీటిలో భారీ బోట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కీలక షెడ్యూల్‌లో మహేశ్‌ బాబు, ప్రియాంక, పృథ్వీరాజ్‌తో పాటు దాదాపు 3వేల‌ మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొననున్నారని, ఇందుకోసం వారంతా ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ వార్తలతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
SS Rajamouli
Death Stranding 2
Hideo Kojima
Mahesh Babu
SSMB29
RRR Movie
Video Game
Indian Cinema
Tollywood

More Telugu News