Madhya Pradesh Scam: 4 లీటర్ల పెయింట్ వేయడానికి 168 మంది కూలీలు, 65 మంది మేస్త్రీలు!.. మధ్యప్రదేశ్ లో విడ్డూరం!

Madhya Pradesh Scam 168 Workers for 4 Liters Paint
  • మధ్యప్రదేశ్‌లో పాఠశాలల పెయింటింగ్ పనుల్లో భారీ అవినీతి వెలుగులోకి!
  • నాలుగు లీటర్ల పెయింట్‌కు రూ.1.07 లక్షల బిల్లు చూపిన వైనం
  • పది కిటికీలకు రంగులు వేయడానికి 425 మంది సిబ్బందిని వాడినట్లు రికార్డులు
  • నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు లేకుండానే బిల్లుల ఆమోదం
  • బిల్లు తయారీకి నెల ముందే ప్రిన్సిపాల్ ఆమోద ముద్ర
  • ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన జిల్లా విద్యాశాఖ
మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఓ వింత కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేవలం 10 కిటికీలు, 4 తలుపులకు రంగులు వేయడానికి ఏకంగా 275 మంది కూలీలను, 150 మంది మేస్త్రీలను నియమించినట్లు పత్రాలు సృష్టించి లక్షల రూపాయలు కాజేశారు. షాడోల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన ఈ అవినీతి బాగోతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే, షాడోల్ జిల్లాలోని నిపానియా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 10 కిటికీలు, 4 తలుపులకు 20 లీటర్ల పెయింట్ వేయడానికి సుధాకర్ కన్‌స్ట్రక్షన్ అనే సంస్థ రూ. 2.3 లక్షల బిల్లును సమర్పించింది. ఈ చిన్న పని కోసం 275 మంది కూలీలు, 150 మంది మేస్త్రీలను వినియోగించినట్లు రికార్డుల్లో చూపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే తరహాలో, సకండి గ్రామంలోని మరో పాఠశాలలో కేవలం నాలుగు లీటర్ల పెయింట్ వేయడానికి రూ. 1.07 లక్షల బిల్లు పెట్టారు. ఈ పనికి 168 మంది కూలీలు, 65 మంది మేస్త్రీలు అవసరమయ్యారని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో పత్రాల తారుమారు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నిపానియా పాఠశాలకు సంబంధించిన బిల్లును 2025 మే 5న సృష్టించగా, పాఠశాల ప్రిన్సిపాల్ ఏకంగా నెల రోజుల ముందే, అంటే ఏప్రిల్ 4నే దాన్ని వెరిఫై చేసి ఆమోదించడం గమనార్హం. నిబంధనల ప్రకారం పనులకు ముందు, తర్వాత తీసిన ఫొటోలను బిల్లులకు జతచేయాల్సి ఉన్నప్పటికీ, అవేవీ లేకుండానే అధికారులు బిల్లులను ఆమోదించారు.

ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి ఫూల్ సింగ్ మర్పాచి స్పందించారు. "రెండు పాఠశాలలకు సంబంధించిన బిల్లులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరుపుతున్నాం. విచారణలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఆయన తెలిపారు.
Madhya Pradesh Scam
Madhya Pradesh
Government Funds Misuse
Shadol District
School Renovation Scam
Sudhakar Construction
Corruption India
Education Department
Nipania School
Fool Singh Marpachi

More Telugu News