అక్రమ నిర్మాణాలు, బ్యాంకు రుణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

  • ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో తాజా మార్గదర్శకాలు జారీ
  • నివాసయోగ్య పత్రం చూశాకే బ్యాంకులు నిర్మాణాలపై రుణాలు ఇవ్వాలి
  • అధికారులు ఎప్పటికప్పుడు బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాన్ని తనిఖీ చేయాలని ఆదేశాలు
అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రాష్ట్రాలకు ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

పురపాలక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌పై భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలి. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల్లోకి వచ్చేలా చూడాలి. నిర్మాణం పూర్తయ్యే వరకు ప్లాన్ ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలి. ఎప్పటికప్పుడు అధికారులు బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాన్ని తనిఖీ చేయాలి.

డీవియేషన్ సరిచేసే వరకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వవద్దు. డీవియేషన్ ఉన్న నిర్మాణాలకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇస్తే చర్యలు తీసుకోవాలి. నివాసయోగ్య ధ్రువపత్రం ఇస్తేనే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలి. అక్రమ నిర్మాణాలకు ట్రేడ్, బిజినెస్ లైసెన్స్‌లు జారీ చేయొద్దు. జోనల్ ప్లాన్‌లోనూ డీవియేషన్ లేకుండా నిర్మాణాలు ఉండేలా చూడాలి. నివాసయోగ్య పత్రం చూశాకే బ్యాంకులు నిర్మాణాలపై రుణాలు ఇవ్వాలి.


More Telugu News