హైదరాబాద్‌లో భూదాన్ కేసు: పాతబస్తీలో ఈడీ సోదాల కలకలం

  • హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురా, సంతోష్‌నగర్‌లో ఈడీ సోదాలు
  • భూదాన్ భూముల కేసు దర్యాప్తులో భాగంగా తనిఖీలు
  • సుకూర్, షర్ఫన్ సహా నలుగురి నివాసాలపై ఈడీ దాడులు
  • ఈఐపీఎల్ సంస్థకు సుకూర్ బినామీ అని ఈడీ ఆరోపణ
  • గతంలో ఈ కేసులో కలెక్టర్, తహసీల్దార్‌ను విచారించిన ఈడీ
భూదాన్ భూముల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఈడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యాకుత్‌పురా, సంతోష్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని నివాసాల్లో ఈ సోదాలు జరిగింది.

భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఈఐపీఎల్ సంస్థ లావాదేవీలపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ సంస్థ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా భూములు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈఐపీఎల్ సంస్థకు సుకూర్ అనే వ్యక్తి బినామీగా వ్యవహరించాడనే అనుమానంతో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుకూర్‌తో పాటు అతని బంధువు షర్ఫన్, మరో ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో భాగంగా ముఖ్యమైన పత్రాలు, లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇదే కేసులో గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్‌ను, మహేశ్వరం తహసీల్దార్‌ను కూడా ఈడీ అధికారులు విచారించారు.


More Telugu News