ప్రకాశం జిల్లాలో ఒకే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు .. ఐదుగురు మృతి

  • కొప్పోలు ఫ్లైఓవర్ సమీపంలో ఘటన
  • కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన వైనం
  • అగి ఉన్న కారును ఢీకొన్న లారీ
ప్రకాశం జిల్లాలో దాదాపు ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రమణయ్య (60), బాబు (45), నాగేంద్ర (25) మృతి చెందారు. 

అయితే బోల్తా పడిన ఈ లారీని మరో లారీ ఢీకొనడంతో పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంబించిపోయింది. ఆ ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారును వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న పావని (25), కౌశిక్ (14) మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. 

వీరు గుంటూరు జిల్లా నుంచి తిరుమలకు వెళుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.   


More Telugu News