బ‌స్సు కండ‌క్ట‌ర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడి

  • రెచ్చిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా 
  • తన అనుచ‌రుల‌తో క‌లిసి ఓ ప్రైవేట్‌ బ‌స్సు కండ‌క్ట‌ర్‌పై దాడి
  • గురువారం మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్‌లో ఘటన
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా రెచ్చిపోయారు. తన అనుచ‌రుల‌తో క‌లిసి ఓ ప్రైవేట్‌ బ‌స్సు కండ‌క్ట‌ర్‌పై దాడికి పాల్ప‌డ్డారు. గురువారం మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే... మద‌న‌ప‌ల్లె మండ‌లం దొన‌బైలుకు చెందిన హ‌రినాథ్ కొన్నేళ్లుగా మ‌ధుసూద‌న అనే ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఆయ‌న బ‌స్సు బెంగ‌ళూరు నుంచి బ‌య‌లుదేరి మ‌ద‌న‌ప‌ల్లెకు వ‌చ్చే క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే న‌వాజ్‌బాషాకు చెందిన బ‌స్సును ప‌లుమార్లు మ‌ధ్య‌లో ఓవ‌ర్‌టేక్ చేసుకొని వ‌స్తోంది. గ‌తంలోనూ ప‌లుమార్లు ఈ రెండు బ‌స్సుల స‌మ‌యాల‌పై ఇరువురి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయి. 

గురువారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌లకు మ‌ధుసూద‌న మ‌ద‌న‌ప‌ల్లెలోని బెంగ‌ళూరు బ‌స్టాండ్‌కు చేరుకోగా ప్ర‌యాణికులు ఎక్కుతున్నారు. దీంతో ఆగ్ర‌హించిన మాజీ ఎమ్మెల్యే 20 మందికి పైగా త‌న అనుచ‌రుల‌తో క‌లిసి కండ‌క్ట‌ర్ హ‌రినాథ్‌పై దాడికి పాల్ప‌డ్డారు. త‌న బ‌స్సు కంటే ముందుగా ఎందుకు వ‌స్తున్నారంటూ కొట్టిన‌ట్లు బాధితుడు తెలిపాడు. దాడిలో గాయపడిన హరినాథ్ స్థానిక ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని టుటౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కండ‌క్ట‌ర్ ఫిర్యాదు మేర‌కు ఘ‌టనాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే న‌వాజ్ బాషాతో మాట్లాడారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న అనుచ‌రుల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు సీఐ చంద్ర వెల్ల‌డించారు.  

ఇక, నవాజ్ బాషా ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండక్టర్‌పై దాడి చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులుగా గల రాష్ట్రాలకు ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ట్రావెల్స్ మధ్య ఓ విధమైన పోటీ వాతావరణం ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే.


More Telugu News