హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయి విమర్శలు చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ
  • అసదుద్దీన్‌పై ట్రోలింగ్స్ చేస్తున్న పాకిస్థాన్‌కు చెందిన నెటిజన్లు
  • నా కంటే అందగాడు వారికి కనిపించలేదేమో, అందుకే నా ప్రసంగాలు వింటున్నారన్న అసదుద్దీన్ ఒవైసీ 
  • నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండని   వ్యాఖ్య
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఇస్లాంలో హింసకు తావులేదని అసదుద్దీన్ పదేపదే స్పష్టం చేస్తున్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను సైతం ఆయన విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్‌పై పాకిస్థాన్‌కు చెందిన పలువురు ట్రోలింగ్‌కు దిగారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

"పాకిస్థాన్‌లో ఉన్నవారికి భారత్‌లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నాకంటే అందగాడు వారికి కనిపించలేదేమో, అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు" అని ఒవైసీ అన్నారు. "నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తొలగించండి. అది అందరికీ మంచిది, మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది" అంటూ అసద్ కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల అఖిలపక్ష సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి అసదుద్దీన్ ఒవైసీని ఆహ్వానించారు. అప్పటి నుంచి ఒవైసీ పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగడుతూ ఉన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్ధ శతాబ్దం వెనక్కి పోయిందంటూ అసద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చిన ప్రతిసారీ పాకిస్థాన్ తీరుపై అసద్ ధ్వజమెత్తుతూనే ఉన్నారు. 


More Telugu News