పాకిస్థాన్ కోలుకోవడానికి కనీసం నాలుగైదేళ్లు పడుతుంది: అమిత్ షా

  • బీఎస్ఎఫ్ దెబ్బకు పాక్ విలవిల్లాడిందన్న అమిత్ షా
  • పాక్ నిఘా వ్యవస్థ ఛిన్నాభిన్నమయిందని వ్యాఖ్య
  • పాక్ దాడుల బాధితులకు త్వరలోనే ప్యాకేజీ ఇస్తామని హామీ
ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలిసారిగా ఈరోజు జమ్మూకశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత బలగాల ధైర్యసాహసాలను కొనియాడారు.

"ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మనం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా, పాకిస్థాన్ సైన్యం మన సరిహద్దుల్లోని పౌరులపై దాడులకు తెగబడింది. అయితే, మన బీఎస్ఎఫ్ దళాలు ఈ దాడులను అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టాయి" అని తెలిపారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన సుమారు 118 పోస్టులను మన బలగాలు నాశనం చేశాయని ఆయన వెల్లడించారు. "శత్రువుల సమాచార, నిఘా వ్యవస్థలను మనవాళ్లు ఒక్కొక్కటిగా కూల్చివేశారు. ఈ నష్టం నుంచి కోలుకోవడానికి పాకిస్థాన్‌కు కనీసం నాలుగైదేళ్లు పడుతుంది" అని అమిత్ షా పేర్కొన్నారు.

బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అందించిన సమాచారం ప్రకారం, పాకిస్థాన్ సైనిక సమాచార, నిఘా వ్యవస్థలకు ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లిందని అమిత్ షా తెలిపారు. కొంతకాలం పాటు పూర్తిస్థాయి సమాచార ఆధారిత యుద్ధం చేసే స్థితిలో పాకిస్థాన్ లేదని ఆయన అన్నారు. బీఎస్ఎఫ్ దళాల అప్రమత్తత, స్పష్టమైన వ్యూహరచన, వాటిని విజయవంతంగా అమలు చేసిన తీరును హోంమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత సరిహద్దుల్లో ఎలాంటి దాడి జరిగినా, ఆ భారాన్ని మొట్టమొదట మోసేది బీఎస్ఎఫ్ జవాన్లేనని ఆయన గుర్తుచేశారు.

జమ్మూకశ్మీర్‌లో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా, ఇటీవల పాకిస్థాన్ జరిపిన దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను అమిత్ షా పరామర్శించారు. పాక్ దాడుల వల్ల దెబ్బతిన్న ఇళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పరిహార ప్యాకేజీని ప్రకటిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పాక్ దాడులతో నష్టపోయిన పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన అమిత్ షా, అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. 


More Telugu News