ప్రధాని పేరు మరిచిపోయిన సీఎం నితీశ్ కుమార్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

  • శుక్రవారం కరకత్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం నితీశ్ ప్ర‌సంగం
  • ప్ర‌ధాని మోదీని అటల్ బిహారీ వాజ్‌పేయి అని సంభోదించిన వైనం
  • ఆ త‌ర్వాత త‌న త‌ప్పును తెలుసుకుని క‌వ‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నం
  • ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌
బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్‌ చిన్న‌ పొరపాటు కార‌ణంగా మరోసారి వార్త‌ల్లో నిలిచారు. వేదికపై ఉన్న ప్రధాన‌మంత్రి పేరును ఆయన మరిచిపోయారు. ప్ర‌ధాని నరేంద్ర‌ మోదీని అటల్ బిహారీ వాజ్‌పేయి అని పిలిచారు. దీంతో సభకు హాజరైన వారు ఇది విని నిర్ఘాంత‌పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

శుక్రవారం కరకత్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం నితీశ్‌ కుమార్‌ మాట్లాడారు. వేదికపై ఉన్న ప్రధాని మోదీ పేరు చెప్పడానికి ఆయన తడబడ్డారు. మోదీని అటల్ బిహారీ వాజ్‌పేయి అని సంభోదించారు. ఆ వెంటనే తన తప్పును తెలుసుకుని క‌వ‌ర్ చేసేందుకు ప్రయత్నించారు. ‘అటల్ బిహారీ వాజ్‌పేయి గతంలో అభివృద్ధి పనులు చేశారు’ అని అన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ కాగా... నెటిజన్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు.

కాగా, ఇటీవ‌ల ప‌లుమార్లు ఇలాగే నితీశ్ త‌న వింత ప్ర‌వ‌ర్త‌న‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. ఈ ఏడాది జనవరిలో కూడా నితీశ్‌ కుమార్‌ వింతగా ప్రవర్తించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగిన నివాళి కార్యక్రమంలో అకస్మాత్తుగా చప్పట్లు కొట్టారు. అలాగే మార్చిలో పాట్నాలో జరిగిన క్రీడా కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో నితీశ్‌ నవ్వడంతో పాటు పక్కనున్న వారితో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా గతంలో నెట్టింట‌ వైరల్ అయిన విష‌యం తెలిసిందే.


More Telugu News