హనీమూన్ హత్య కేసు.. సోనమ్‌కు మానసిక పరీక్షలు పూర్తి.. నేడు క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్!

  • సోనమ్ మానసిక ఆరోగ్యం బాగానే ఉందన్న వైద్యులు 
  • నిందితులను నేడు ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్న సిట్
  • హనీమూన్‌కు వెళ్లిన భర్తను హత్య చేసినట్టు సోనమ్‌పై ఆరోపణలు
  • పోలీసు కస్టడీలో సోనమ్‌తో పాటు మరో నలుగురు నిందితులు
మేఘాలయలో సంచలనం సృష్టించిన ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన మృతుడి భార్య సోనమ్ రఘువంశీకి నిన్న షిల్లాంగ్‌లోని మేఘాలయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (మిమ్హాన్స్)లో మానసిక పరీక్షలు నిర్వహించారు.

గణేశ్‌దాస్ ఆసుపత్రి వైద్య అధికారి సూచన మేరకు సోనమ్‌కు ఈ ‘మానసిక మదింపు’ పరీక్షలు నిర్వహించామని, ఆమె మానసిక ఆరోగ్యం ‘స్థిరంగా, బాగానే’ ఉందని మిమ్హాన్స్ వైద్యులు నిర్ధారించినట్లు  పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇది సాధారణంగా జరిపే మానసిక వైద్య పరీక్షల్లో భాగమని ఆయన పేర్కొన్నారు.

రాజా రఘువంశీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), నిందితురాలు సోనమ్‌తో పాటు ఇతర సహ నిందితులను నేడు (మంగళవారం) వెయ్ సవ్‌డాంగ్ పార్కింగ్ స్థలానికి తీసుకెళ్లి, నేరం జరిగిన తీరును పునఃసృష్టించే (క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్) అవకాశం ఉందని సమాచారం. 


More Telugu News