బైక్ టాక్సీల రద్దు.. బెంగళూరులో ఆటో చార్జీలు అమాంతం పెంపు

  • రాత్రికి రాత్రే కనీస చార్జీ రూ.10 నుంచి రూ.70 కి పెంచిన అగ్రిగేటర్లు
  • బెంగళూరు ప్రయాణికులకు చుక్కలు.. ఆటో ఎక్కాలంటే జేబుకు చిల్లు
  • టిప్ ఇస్తే గానీ రైడ్ దొరకని పరిస్థితి అని ప్రయాణికుల ఆవేదన
కర్ణాటకలో కోర్టు ఆదేశాల మేరకు బైక్ టాక్సీలు రద్దవడంతో ఆటో ఛార్జీలు అమాంతం పెరిగిపోయాయని ప్రయాణికులు వాపోతున్నారు. రాత్రికి రాత్రే కనీస ఛార్జీలను రూ.10 నుంచి రూ.70 కి పెంచేశారని మండిపడుతున్నారు. టిప్ ఇస్తే గానీ రైడ్ దొరికే పరిస్థితి లేదని, ఆటో ఎక్కాలంటే జేబుకు చిల్లు పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ ఛార్జీల పెంపు స్పష్టంగా కనిపించగా, మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ రైడ్ హెయిలింగ్ యాప్స్‌లో కనీస ఛార్జీలు రాత్రికి రాత్రే రూ.10 నుంచి రూ.70 వరకు పెరిగాయని పలువురు ప్రయాణికులు తెలిపారు. కోరమంగళ ఫస్ట్ బ్లాక్ నుంచి లాంగ్‌ఫోర్డ్ రోడ్డులోని తన కార్యాలయానికి ప్రయాణించే సోయిబం జయానంద సింగ్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ.. సాధారణంగా రద్దీ సమయాల్లో ఆటో ప్రయాణానికి రూ.140 నుంచి రూ.150 ఖర్చయ్యేదని, ఇప్పుడు అది మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందిరానగర్‌లో నివసిస్తూ రిచ్‌మండ్ టౌన్‌లో పనిచేసే మరో ప్రయాణికురాలు మాట్లాడుతూ.. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఛార్జీలు సుమారు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయని తెలిపారు. అంతేకాకుండా, కనీసం రూ.60 టిప్ ఇస్తే తప్ప ఆటో రైడ్ దొరకడం కష్టంగా మారిందని ఆమె వాపోయారు. సుల్తాన్‌పాళ్య నుంచి హెబ్బాల్‌కు ప్రయాణించే స్నేహ అనే యువతి మాట్లాడుతూ.. సాధారణంగా రూ.120 ఉండే ఛార్జీ నమ్మా యాత్రిలో రూ.25, రాపిడో మరియు ఓలాలో రూ.40 వరకు పెరిగిందని అన్నారు. అదేవిధంగా, అక్షయ్‌నగర్ నుంచి ఎంజీ రోడ్డుకు 11 కిలోమీటర్ల ప్రయాణానికి సాధారణంగా రూ.160 కాగా, మంగళవారం మధ్యాహ్నం రూ.230 వసూలు చేసినట్లు తెలిసింది.

ఈ ధరల పెరుగుదల మార్కెట్ శక్తుల ప్రత్యక్ష పర్యవసానమేనని ఓ ప్రముఖ రైడ్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌కు చెందిన ప్రతినిధి తెలిపారు. ఏదేమైనా, డిమాండ్‌కు అనుగుణంగా వేగంగా ఛార్జీలను మార్చే ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానం ప్రస్తుతం చట్టపరమైన పరిశీలనలో ఉంది. ఈ ఆకస్మిక ఛార్జీల పెంపుతో బెంగళూరు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


More Telugu News