స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతి .. ఆళ్లగడ్డలో విషాదం

  • నంద్యాల జిల్లాలో విషాదం
  • స్కూల్‌కు వెళ్లిన తొలిరోజే ప్రమాదానికి గురై మృతి చెందిన చిన్నారి
  • ఆళ్లగడ్డ ఎంవీ నగర్‌లో ఘటన
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..

ఆళ్లగడ్డలోని ఎంవీ నగర్‌కు చెందిన శ్రీధర్, వనజ దంపతుల కుమార్తె హరిప్రియ (5) ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. నిన్న చిన్నారి తొలిరోజు పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం పాఠశాల బస్సులో తిరిగి వచ్చిన ఆ చిన్నారి బస్సు ముందు నుంచి రోడ్డు దాటుతుండగా, గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో చిన్నారి బస్సు టైర్ల కింద పడి ప్రాణాలు కోల్పోయింది.

ఈ హృదయ విదారక సంఘటన స్థానికులను కలచివేసింది. చిన్నారి మృతితో ఎంవీ నగర్‌లో విషాదం నెలకొంది. పాఠశాలకు వెళ్లిన తొలిరోజే తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News