టాయిలెట్‌లో ఉండి కోర్టు విచారణకు హాజరు.. నిందితుడిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

  • గుజరాత్ హైకోర్టు వర్చువల్ విచారణలో వింత ఘటన
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి
  • వ్యక్తిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు
  • భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం
కోర్టు వర్చువల్ విచారణ జరుగుతుండగా ఓ వ్యక్తి టాయిలెట్ నుంచి హాజరుకావడం వివాదాస్పదమైంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గుజరాత్ హైకోర్టు సదరు వ్యక్తిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

జూన్ 20న జస్టిస్ నజీర్ ఎస్. దేశాయ్ ఓ కేసును వర్చువల్‌గా విచారిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ సమయంలో న్యాయమూర్తి ఈ విషయాన్ని గమనించలేదు. ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం కోర్టు దృష్టికి వచ్చింది. వీడియో ఆధారంగా, నిందితుడిని సూరత్‌లోని కిమ్ గ్రామానికి చెందిన అబ్దుల్ సమద్‌గా అధికారులు గుర్తించారు.

ఈ ఘటనపై జూన్ 30న విచారణ చేపట్టిన జస్టిస్ ఏ.ఎస్. సుపేహియా, జస్టిస్ టీ.ఆర్. వచ్ఛనీలతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి చర్యలు కోర్టును అగౌరవపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ అతనిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

వైరల్ అయిన వీడియో ప్రకారం అబ్దుల్ సమద్ విచారణ సమయంలో టాయిలెట్‌లోకి వెళ్లి, కెమెరాలో తాను కనిపించేలా ఫోన్‌ను నేలపై పెట్టి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత డిస్‌కనెక్ట్ అయి, మళ్లీ కాసేపటికి విచారణలో చేరాడు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి సాంకేతిక చర్యలు తీసుకోవాలో సూచించాలని హైకోర్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.


More Telugu News