Boris Johnson: మద్యం విందులపై పార్లమెంటులో క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Boris Johnson says apology to britian parliament on party gate scandal
  • దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో జాన్సన్ పుట్టిన రోజు వేడుకలు
  • స్యూ గ్రే కమిషన్‌ నివేదికలో పేర్కొన్న అంశాలను అంగీకరించిన బ్రిటన్ ప్రధాని
  • క్షమాపణలు చెప్పి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని సూచన
కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి పార్టీలు చేసుకున్నందుకు గాను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంటుకు క్షమాపణలు తెలిపారు. జూన్ 2020లో దేశంలో కఠిన లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ బోరిస్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. దీనిని పార్టీగేట్ కుంభకోణంగా వ్యవహరిస్తున్నారు.

ఈ ఘటనపై స్యూ గ్రే కమిషన్ తుది నివేదిక సమర్పించిన నేపథ్యంలో ప్రధాని క్షమాపణలు చెప్పక తప్పలేదు. పార్టీలకు సీనియర్ నాయకత్వమే బాధ్యత వహించాలంటూ కమిషన్ సమర్పించిన నివేదికలోని అంశాలను పార్లమెంటులో అంగీకరించిన ప్రధాని.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ముందుకు కదులుదామని, ప్రభుత్వ ప్రాధాన్యాలపై దృష్టి పెడదామని అన్నారు. 

ఈ వ్యవహారంపై గతంలో ఒకసారి స్పందించిన జాన్సన్.. నిబంధనలు ఉల్లంఘించాలనేది తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ఆ సమయంలో స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం పార్టీగా పరిగణిస్తారని తాను అనుకోలేదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరారు. పార్టీగేట్ కుంభకోణం నేపథ్యంలో ప్రధాని పదవికి బోరిస్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన అలా స్పందించారు.
Boris Johnson
Britain
Party Gate
Corona Virus
COVID19 Lockdown

More Telugu News