Lakshmi Parvati: పవన్ కల్యాణ్ అమాయకుడు.. టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ కు అప్పగించాలి: లక్ష్మీపార్వతి

Pawan Kalyan is innocent says Lakshmi Parvati

  • పవన్ ను చంద్రబాబు వాడుకుంటున్నారన్న లక్ష్మీపార్వతి
  • జగన్ ను తిట్టడాన్నే లోకేశ్ పనిగా పెట్టుకున్నాడని మండిపాటు
  • పోలవరం పనుల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమాయకుడని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. పవన్ పై తనకు సానుభూతి ఉందని చెప్పారు. అయితే పవన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు వాడుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు పుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్ ఇద్దరూ హంతకుల్లా మాట్లాడుతున్నారని... అధికారంలోకి వస్తే కొడతాం, చంపుతాం అంటున్నారని విమర్శించారు. చదవడం, రాయడం చేతకాని లోకేశ్ పాదయాత్రలో సీఎం జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. లోకేశ్ ను చంద్రబాబు సరైన మార్గంలో పెంచలేదని అన్నారు. 

వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరుగుతోందని టీడీపీ నేతలు అంటున్నారని... వారి హయాంలో లక్షల కోట్లు దోచుకున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. అబద్ధాలు చెపుతూ పాలించారని చెప్పారు. జగన్ తన మేనిఫెస్టోలో చెప్పిన 99.5 శాతం హామీలను నెరవేర్చారని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అద్భుతంగా పాలించారని చెప్పారు. పోలవరం పనుల్లో కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. 

ఎన్టీఆర్ మనవడిగా లోకేశ్ ను ప్రజలు స్వీకరించడం లేదని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ లేదా కల్యాణ్ రామ్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని చెప్పారు.

  • Loading...

More Telugu News