Dhanush: వయనాడ్ బాధితులకు సినీ నటుడు ధనుశ్ విరాళం

Actor Dhanush donates to Wayanad incident

  • వయనాడ్ బాధితులకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్న సినీ సెలబ్రిటీలు
  • తాజాగా రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించిన ధనుశ్
  • కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆ మొత్తాన్ని అందజేయనున్న ధనుశ్

కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఎవరి వంతు సాయం వారు చేస్తున్నారు. ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళ సినీ నటుడు ధనుశ్ తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆ మొత్తాన్ని అందజేయనున్నారు.
 
వయనాడ్ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ లు ఇప్పటికే భారీ విరాళాన్ని అందజేశారు. చిరంజీవి, రామ్ చరణ్ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ఇటీవల చిరంజీవి కేరళ రాష్ట్ర సీఎంను కలిసి స్వయంగా విరాళం చెక్కును అందజేశారు. ప్రభాస్ రూ.2 కోట్లు సాయం ఇస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.25 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు.
 
అలానే చిత్ర పరిశ్రమ నుండి సూర్య, జ్యోతిక, కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార – విఘ్నేశ్ శివన్ దంపతులు రూ.20 లక్షలు, మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, కమల హాసన్ రూ.25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడమే కాక తను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ.3 కోట్ల విరాళం బాధితులకు అందిస్తున్నట్లు ప్రకటించారు.

వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 350 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు నాలుగు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

  • Loading...

More Telugu News