Preethi Pal: చ‌రిత్ర సృష్టించిన ప్రీతి పాల్‌.. తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా రికార్డు!

Preethi Pal scripts history in track and field with bronze in 200m T35 in Paris Paralympics

  • పారిస్‌లో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో అద‌ర‌గొట్టిన‌ భార‌త స్ప్రింట‌ర్  
  • ట్రాక్ అండ్‌ ఫీల్డ్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా నిలిచిన ప్రీతి 
  • మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ35 కేట‌గిరీలో కాంస్యం
  • అంతకుముందు మహిళల 100 మీట‌ర్ల‌ టీ35లోనూ బ్రాంజ్ మెడల్ గెలిచిన ప్రీతి

పారిస్‌లో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త పారా స్ప్రింట‌ర్ ప్రీతి పాల్ రికార్డు సృష్టించింది. మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ35 కేట‌గిరీలో కాంస్య ప‌త‌కం గెలుచుకుంది. దీంతో ట్రాక్ అండ్‌ ఫీల్డ్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా రికార్డుకెక్కింది.
 
ఆదివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన 200 మీట‌ర్ల రేసులో ప్రీతి కెరీర్ లో బెస్ట్ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. 30.01 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌తో కాంస్యం నెగ్గింది. చైనా ద్వయం జియా జౌ (28.15 సెక‌న్లు), గువో కియాన్‌కియాన్(29.09) వ‌రుస‌గా స్వర్ణం, రజతం కైవసం చేసుకున్నారు.

అంతకుముందు శుక్రవారం మహిళల 100మీ టీ35లోనూ భారత స్ప్రింటర్ కాంస్యం సాధించిన విష‌యం తెలిసిందే. 23 ఏళ్ల ఆమె ఫైనల్‌లో 14.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. 

యూపీకి చెందిన ప్రీతి సోషల్ మీడియాలో పారాలింపిక్ గేమ్స్ క్లిప్‌లను చూసిన తర్వాత 17 ఏళ్ల వయసులో పారా స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన కొన్నేళ్ల‌కు ఆమె తన గురువు, పారాలింపియన్ ఫాతిమా ఖాటూన్‌ను కలుసుకోవడంతో ప్రీతి జీవితం మారిపోయింది.

ఫాతిమా ప్రోత్సాహంతో ప్రీతి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంది. 2023 ఆసియా పారా గేమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన ఇచ్చింది. దాంతో పారిస్ పారాలింపిక్ గేమ్స్‌కు అర్హత పోటీల కోసం ప్రీతి ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కోచ్ గజేందర్ సింగ్ వద్ద శిక్షణ పొందింది. ఆమె కోచ్ సహాయంతో తన రన్నింగ్ టెక్నిక్‌లను మెరుగుపరచుకుంది. 

ఆ తర్వాత ఈ ఏడాది జ‌రిగిన‌ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ప్రీతి తన మొదటి అంతర్జాతీయ పతకాన్ని కైవసం చేసుకుంది. అక్కడ ఆమె 100 మీట‌ర్లు, 200 మీటర్ల ఈవెంట్‌లలో కాంస్య పతకాలను సాధించింది.

  • Loading...

More Telugu News