Sajjala Ramakrishna Reddy: ఏపీ హైకోర్టులో సజ్జలకు ఊరట... గతంలో ఇచ్చిన ఆదేశాలు పొడిగింపు

High Court extends protection for Sajjala from arrest
  • టీడీపీ ఆఫీసుపై దాడి కేసు
  • ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సజ్జల
  • సజ్జల పిటిషన్ పై విచారణ
  • సజ్జలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్న ఉన్నత న్యాయస్థానం
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సజ్జల రామకృష్ణారెడ్డిపై మరో రెండు వారాల పాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. 

ఈ కేసులో సజ్జల ముందస్తు బెయిల్ కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమను వేధిస్తున్నారని సజ్జల ఆరోపించారు. ముఖ్యంగా, తనపై 41ఏ నోటీసులకు అవకాశం లేని సెక్షన్లతో కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు. అందుకే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల కోర్టును కోరారు. 

ఈ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు... గతంలో ఇచ్చిన ఆదేశాలను మరో రెండు వారాలు పొడిగించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 
Sajjala Ramakrishna Reddy
AP High Court
Anticipatory Bail
TDP Office Attack Case
Andhra Pradesh

More Telugu News